Share News

రేవంత్‌ పాలనకు 1,000 రోజులు.. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

ABN , Publish Date - Sep 02 , 2026 | 08:48 PM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి నేటితో 1,000 రోజులు పూర్తైన సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

రేవంత్‌ పాలనకు 1,000 రోజులు.. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు
Telangana Congress Government 1000 Days

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తైన సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు నిర్బంధ వాతావరణంలో గడిపారని జగ్గారెడ్డి విమర్శించారు. స్వేచ్ఛ కావాలనే ఆకాంక్షతోనే ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో పోలీసుల నిర్బంధాలు లేవని, మీడియాపై ఆంక్షలు విధించలేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సచివాలయానికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశాన్ని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందన్నారు. అన్ని రంగాల్లో నియంతృత్వ ధోరణికి ముగింపు పలికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకొచ్చామని జగ్గారెడ్డి తెలిపారు.


‘త్యాగాలు విద్యార్థులవి.. పేరు మీకా?’ : జగ్గారెడ్డి

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోయిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ 1,000 రోజుల పాలనలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రేషన్‌ కార్డులు పంపిణీ చేసి, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని తామే సాధించామని చెప్పుకునే కేసీఆర్‌ కుటుంబంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన ఒక్కరినైనా చూపించాలని ప్రశ్నించారు.


కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోయినా నష్టమేం లేదు: జగ్గారెడ్డి

కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నిస్తే కేటీఆర్‌ చెప్పే సమాధానం హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ రాజీనామా చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌, ఆయన కుటుంబంలోని ముగ్గురు అసెంబ్లీకి రాకపోయినా ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీని కాంగ్రెస్‌ ఎప్పుడో లైట్‌ తీసుకుంది’ అని జగ్గారెడ్డి అన్నారు.


కేసీఆర్‌కు హక్కు లేదు: జగ్గారెడ్డి

రాహుల్‌ గాంధీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. విద్యార్థుల త్యాగాలను తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్‌.. తెలంగాణ కోసం కృషి చేసిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను విమర్శించకూడదని జగ్గారెడ్డి హితవు పలికారు.

Also Read:

శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్

Updated Date - Sep 02 , 2026 | 08:56 PM