Share News

ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:42 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నానని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కానన్నారు.

ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కిషన్ రెడ్డి
Central Minister Kishan Reddy

న్యూఢిల్లీ, జూన్09: తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నానని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కానన్నారు. సీఎం రేవంత్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటూ రేవంత్‌రెడ్డిపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌ రెడ్డిలాగా తాను మాటకారిని కాను.. కానీ మాటపై నిలబడే వ్యక్తిని అని కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. పదవులు, అధికారం కోసం మాటలు మార్చే వ్యక్తిని తాను కానని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు.


కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని అధికార పార్టీ నేతలకు కిషన్‌రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. మీరిచ్చిన ఏ గ్యారంటీ అయినా అమలు చేశారా? అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని వ్యంగ్యంగా అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, ప్రజలను వంచించడంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని పేర్కొన్నారు.


ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం మారలేదంటూ కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి సోకులు చేస్తున్నారంటూ గత బీఆర్ఎస్, ప్రస్తుత రేవంత్ సర్కార్ తీరును ఆయన ఎండగట్టారు. హైదరాబాద్‌లో భూములు మిగిలే పరిస్థితి లేదన్నారు. మంత్రులతోపాటు అందరూ భూ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయ్యిందని చెప్పారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు.


సీఎం రేవంత్‌ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను సీఎం రేవంత్‌ రెడ్డి బెదిరిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను గమనించాలంటూ తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా సూచించారు. సీఎం రేవంత్‌కు తాము గులాంలు కామన్నారు. తనకు సీఎం రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్‌ అవసరం లేదని మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణిని దోచుకుంటున్న ప్రభుత్వం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

వైసీపీ అసత్య ప్రచారం.. వారి దిగజారుడుతనానికి నిదర్శనం: ఎంపీ కలిశెట్టి

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 07:21 PM