Share News

తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:40 PM

భారతదేశ యువశక్తికి సరైన క్రీడా సదుపాయాలను, అవసరమైన ప్రోత్సాహాన్ని కల్పించి.. వారిలోని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టడంతోపాటుగా వారికి క్రీడా రంగంలో ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది.

తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’
KHELO INDIA

  • డిసెంబర్‌లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

  • కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

  • రూ.22 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

  • హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‍నగర్ వేదికలుగా క్రీడాపోటీల నిర్వహణ

  • దేశం నలుమూలల నుంచి 6వేలకు పైగా క్రీడాకారులు పాల్గొనే అవకాశం

  • తెలంగాణకు అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • రేపు దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్’ పేరుతో ఖేలో ఇండియా సంవాద్

  • యువ క్రీడాకారులతో వర్చువల్‌గా మాట్లాడనున్న ప్రధాని నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 26: భారతదేశ యువశక్తికి సరైన క్రీడా సదుపాయాలను, అవసరమైన ప్రోత్సాహాన్ని కల్పించి.. వారిలోని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టడంతోపాటుగా వారికి క్రీడా రంగంలో ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. అందుకోసం గత 12 ఏళ్లుగా వివిధ కార్యక్రమాలతోపాటు పథకాలను తీసుకొచ్చింది.


‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా.. దేశంలోని యువ క్రీడాశక్తిని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్’, ‘ఖేలో ఇండియా పారా గేమ్స్’, ‘ఖేలో ఇండియా వింటర్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా బీచ్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్’, ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ వంటి క్రీడా పోటీల నిర్వహణ ద్వారా క్రీడాకారులు తమలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను, తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది.


ఇప్పటి వరకు జరిగిన 24 ఎడిషన్ల ‘ఖేలో ఇండియా ’ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 60 వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పరంపరలో భాగంగా.. ఈ ఏడాది జరగనున్న 8వ ఎడిషన్ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ ను తెలంగాణలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వేదికగా ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ ఎడిషన్‌లో మొత్తం 25 క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆతిథ్య రాష్ట్రమైన తెలంగాణ.. ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించవచ్చు. దీంతో పాటుగా మరో కొత్త క్రీడను కూడా ఈ ఈవెంట్లో ఆడించనున్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 6వేల మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా.


ఈ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ నిర్వహణకోసం.. కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లను విడుదల చేసింది. ఈ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (NSF), స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఖేలో ఇండియా పథకం అడ్‌హక్ కమిటీ, స్టీరింగ్ కమిటీల సంయుక్త నిర్వహణలో నిర్వహించనున్నారు.


ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను తెలంగాణకు కేటాయించడం పట్ల.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత యువతలో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, వారికి తగిన క్రీడా సదుపాయాలు కల్పించడం, అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం, ప్రతిభను వెలితీయడంలో గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు.

స్పోర్ట్స్ బడ్జెట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. స్పోర్ట్స్ బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని, ఖేలో ఇండియా వంటి పథకాల ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రతిభకు సరైన ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు.


‘ఖేలో ఇండియా’ స్కీమ్‌లో భాగంగా.. తెలంగాణలో కూడా దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన జరిగిందని, అందులో రూ.11.5 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సింథటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్ట్, మహిళల కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలను కల్పించారని, మరో రూ.18.5 కోట్లతో రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో క్రీడా సదుపాయాలను కల్పించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 33 ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మరో రూ.8.5 కోట్లను తెలంగాణలో క్రీడాభివృద్ధికి ఖర్చు చేశామన్నారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఖేలో ఇండియా స్కీమ్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS), అసిస్టెన్స్ టు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ANSFs), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) స్కీమ్ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణకు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్.. టాప్స్ ప్రోగ్రామ్ సహాయంతో ఇవాళ భారతదేశ కీర్తిపతాకను రెపరెపలాడిస్తోంది. ఈ పథకం ద్వారా ఆమెకు అత్యాధునిక శిక్షణతోపాటుగా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని అనుభవం గడించేందుకు ప్రోత్సాహం లభించింది.

తెలుగు తేజం.. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా.. టాప్స్ కార్యక్రమం ద్వారా.. అంతర్జాతీయ స్థాయి శిక్షణ, సపోర్టింగ్ స్టాఫ్ సహకారంతో.. ఒలింపిక్స్ మెడల్ సాధించింది. క్రీడారంగంలో ఆమె రాణిస్తున్న తీరును ప్రోత్సహిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 2015లో పద్మశ్రీ, 2020లో పద్మభూషణ్ అవార్డును అందించింది. ఇలాంటి క్రీడాకారులెందరికో.. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 2014కు ముందు మొత్తం 23 ఒలింపిక్స్ ఎడిషన్లలో.. 23 పతకాలు సాధించగా.. 2014 నుంచి 2024 వరకు మూడు ఎడిషన్లలో 15 పతకాలు సాధించాం.


పారాలింపిక్స్‌లోనూ.. 2014కు ముందు దేశం కేవలం 8 పతకాలు సాధించగా.. 2014 నుంచి 2024 పారాలింపిక్స్ లో.. 52 పతకాలు సాధించాం. 2014కు ముందు దేశంలో స్పోర్ట్స్ బడ్జెట్ రూ.1,219 కోట్లుండగా.. 2025-26లో ఇది రూ.3,794 కోట్లకు పెరిగింది. దేశంలో 2014కు ముందు రూ.191 కోట్ల విలువైన 38 స్పోర్ట్స్ ప్రాజెక్టులుండగా.. ఈ 12 ఏళ్లలో 350 స్పోర్ట్స్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటి విలువ రూ.3,181 కోట్లు.


మరో వైపు, ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే ను పురస్కరించుకుని.. గురువారం (ఆగస్టు 27న).. దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్’ పేరుతో ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి.. 2 కాలేజీల చొప్పున 1,500 లకు పైగా కాలేజీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, ఫిట్‌నెస్‌తో పాటు యువత నేతృత్వంలో దేశ నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద ప్రధాని మోదీ.. వర్చువల్‌గా ప్రసంగించడంతోపాటు క్రీడల పట్ల యువత ఆలోచనలు, ఆకాంక్షల గురించి వారితో మాట్లాడి తెలుసుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రో.. కాస్త ఆగు: రాహుల్‌కు కంగనా రనౌత్ కౌంటర్

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి

For TG News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 04:09 PM