ఉమ్మడి ఏపీకి తిండిలేని సమయంలో సింగరేణి అన్నం పెట్టింది: కవిత
ABN , Publish Date - Apr 05 , 2026 | 02:02 PM
హైదరాబాద్లో సేవ్ సింగరేణి పేరిట రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు కల్వకుంట్ల కవిత. ఉమ్మడి ఏపీలో తినడానికి తిండిలేని సమయంలో సింగరేణి అన్నం పెట్టిందన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్లో సేవ్ సింగరేణి పేరుతో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బొగ్గు ప్రకృతి ఇచ్చిన వరం అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తినడానికి తిండిలేని సమయంలో సింగరేణి అన్నం పెట్టిందన్నారు.
'అండర్ గ్రౌండ్లో వంగి నడుస్తూ ఆక్సిజన్ సరిగా అందకపోయినా.. ఊపిరి తీసుకున్నపుడు లంగ్స్లో బొగ్గుచేరి ఎన్నో అవస్థలు పడుతూ కార్మికులు బొగ్గు తీస్తున్నారు. కార్మికులు సరైన రీతిలో సమయం ప్రకారం డ్యూటీ చేస్తున్నారు. మైనింగ్ అంటే తెలియని వారు అధికారంలో ఉన్నారు. నాడు తెలంగాణ వచ్చాక.. సుమారు 25వేల మందికి ఉద్యోగాలిచ్చారు. 'నియమ నిబంధనలను పక్కనపెట్టి వారికి ఉద్యోగాలెలా ఇచ్చారు, ఎందుకిచ్చారో ఎంక్వయిరీ చేస్తా'నని డిప్యూటీ సీఎం అనడం సరైంది కాదు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క సింగరేణి మీద చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సింగరేణి జోలికొస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు' అని భట్టీని ఉద్దేశించి హెచ్చరించారు కవిత.
సింగరేణి జోలికి వచ్చినవారు ఇప్పటివరకు ఎవరూ బాగుపడలేదని ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. 'మీ చేతకాని తనంతో వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. కార్మికులతో మీకేం సంబంధముందని కాంట్రాక్టులకు దోచిపెడుతున్నారు. రూ.47 వేల కోట్లు ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాలి. కొత్త ఫ్యాక్టరీ రూ.2250 కోట్ల ప్రాజెక్టు. ఈ బిజినెస్లో ఎందుకు చిన్న కంపెనీతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు' అని ప్రశ్నించారు. మెడికల్ బోర్డును పాత పద్ధతిలోనే పెట్టాలని డిమాండ్ చేశారు కవిత. పెండింగ్లో ఉన్న విజిలెన్స్ కేసును క్లియర్ చేయడం సహా కార్మికులకు సొంత ఇళ్లను అమలు చేయాలన్నారు. సింగరేణి కార్మికులకు పన్ను ఉండకూడదని, మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన 300 మందికి వెంటనే పోస్టింగులివ్వాలని కోరారు. క్లర్క్ పోస్టులు, పెండింగ్ బకాయిలు, కార్మికులకు సెంట్రల్ హెల్త్ స్కీమ్ వంటివి వెంటనే అమలు చేయాలని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం జాగృతి మరోసారి సమ్మెకు మద్దతు తెలుపుతుందని ఆమె భరోసానిచ్చారు.
ఇవీ చదవండి:
ఏ ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీ బీజేపీ చీఫ్
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల