Share News

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కవిత

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:02 PM

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు.

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కవిత
Kavitha New Political Party

హైదరాబాద్: మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటానని చెప్పారు. తనకు సెంటిమెంట్ ఎక్కువన్న ఆమె.. మంచి మూహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో తనకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేసిన కవిత.. భవిష్యత్తులో తన రాజకీయ ప్రయాణం పూర్తిగా ప్రజల మద్దతుపైనే ఆధారపడి ఉంటుందన్నారు.


ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు ఎందుకు ప్రచారం చేయడం లేదని కవిత ప్రశ్నించారు. జాగృతి సంస్థ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో హరీశ్ రావు ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు. అలాగే కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.


తనపై విమర్శలు చేస్తున్న వారిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గుంటనక్క, గూఢచారి’ వంటి పేర్లు వారికి నప్పుతాయి కాబట్టే అలా పిలుస్తున్నానన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తాను కూడా మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ వ్యూహం మరింత స్పష్టంగా ఉంటుందని, కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 12:57 PM