‘హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలి: రాంచందర్ రావు
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:54 AM
హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఆగస్టు 14న ట్యాంక్ బండ్ దగ్గర భారీ ‘తిరంగా యాత్ర’ను నిర్వహిస్తున్నామని.. పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 10: ‘హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఈరోజు(సోమవారం) తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 14న ట్యాంక్ బండ్ దగ్గర భారీ ‘తిరంగా యాత్ర’ను నిర్వహిస్తున్నామని.. పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు.
రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాంచందర్ రావు అన్నారు. అందులో భాగంగానే ఈరోజు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొని యువతతో కలిసి తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసినట్లు తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని కోరారు.
అలాగే ఆగస్టు 14న హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ‘తిరంగా యాత్ర’ నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడించారు. ఈ యాత్ర ఏ ఒక్క పార్టీకో, రాజకీయాలకో సంబంధించింది కాదని... భారతదేశ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడానికి, ‘వికసిత భారత్’ సంకల్పంతో చేపడుతున్న యాత్ర అని చెప్పారు. హైదరాబాద్ ప్రజలందరూ కుల, మత, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, దేశం కోసం ఈ తిరంగా యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్
మెడికో ప్రియాంక కేసు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న రాజమండ్రి ఎమ్మెల్యే
Read Latest Telangana News And Telugu News