Share News

జీఎస్టీ ఖాతా హ్యాక్‌..183 కోట్ల నకిలీ బిల్లులు!

ABN , Publish Date - Aug 30 , 2026 | 07:15 AM

ఒక వ్యాపార సంస్థకు చెందిన జీఎస్టీ ఖాతా లాగిన్‌ వివరాలను మార్చేసి.. ఏకంగా రూ.183.61 కోట్ల విలువైన 730 నకిలీ ఇన్‌వాయి్‌సలు, అనధికార ఈ-వే బిల్లులు సృష్టించిన భారీ సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

జీఎస్టీ ఖాతా హ్యాక్‌..183 కోట్ల నకిలీ బిల్లులు!
Fraud cyber

  • 730 ఫేక్‌ ఇన్‌వాయిస్‌లు.. ఈ-వే బిల్లుల సృష్టి

  • ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కొట్టేసేందుకు భారీ స్కెచ్‌

  • తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదు

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఒక వ్యాపార సంస్థకు చెందిన జీఎస్టీ ఖాతా లాగిన్‌ వివరాలను మార్చేసి.. ఏకంగా రూ.183.61 కోట్ల విలువైన 730 నకిలీ ఇన్‌వాయి్‌సలు, అనధికార ఈ-వే బిల్లులు సృష్టించిన భారీ సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ) పొందడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు ఈ వ్యవహారం సాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎ్‌సబీ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన నిఖిల్‌ రెడ్డి, అనంతరెడ్డిలు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ‘యుక్తా ప్లైవుడ్‌ అండ్‌ హార్డ్‌వేర్‌’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న ఆ సంస్థ అకౌంటెంట్‌ జీఎస్టీ పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించగా క్రెడెన్షియల్స్‌ చెల్లవని సందేశం వచ్చింది. పరిశీలించగా గత నెల 23నే గుర్తుతెలియని వ్యక్తులు సంస్థ జీఎస్టీ ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీని మార్చినట్లు ఆయన గుర్తించారు. దీంతో ఆయన తన యజమానికి చెప్పడంతో చార్టెడ్‌ అకౌంటెంట్‌ సలహా మేరకు బాధితులు జీఎస్టీ అధికారులను ఆశ్రయించారు. లాగిన్‌ వివరాలను తిరిగి మార్చి ఖాతాలో జరిగిన లావాదేవీలను పరిశీలించగా ఈ భారీ వ్యవహారం బయట పడినట్లు ఫిర్యాదులో తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా జీఎస్టీ ఖాతాలోకి ప్రవేశించి 730 నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులు సృష్టించారని, వాటి మొత్తం విలువ రూ.1,83,61,09,409.21గా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నకిలీ బిల్లులు పలు కంపెనీలు, సంస్థల పేరుతో సృష్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫిర్యాదులో హిందుస్థాన్‌ ట్రేడర్స్‌, ధన్‌శ్రీ ఎంటర్‌ప్రైజెస్‌, ట్రస్ట్‌ ట్రేడర్స్‌, అమర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఇష్రా ఎంటర్‌ప్రైజెస్‌ తదితర సంస్థల పేర్లు ప్రస్తావించారు. మొత్తం లావాదేవీల వెనుక ఎవరున్నారు? నకిలీ బిల్లుల ద్వారా ఎంత ఐటీసీ క్లెయిమ్‌ చేశారు? ప్రభుత్వానికి వాస్తవంగా ఎంత నష్టం వాటిల్లింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. జీఎస్టీ నంబర్‌ను నేరుగా నకిలీగా సృష్టించలేదు. అసలైన వ్యాపార సంస్థ జీఎస్టీ ఖాతానే స్వాధీనం చేసుకుని, దానికి అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ మార్చి భారీగా నకిలీ బిల్లులు సృష్టించినట్లు ఆరోపణ. దీంతో జీఎస్టీ ఖాతాల హైజాకింగ్‌ వెనుక వ్యవస్థీకృత సైబర్‌ నేరగాళ్ల ముఠా ఉందా? అనే కోణం విచారణలో కీలకంగా మారింది.


ఇవీ చదవండి:

నోటీసులు బీఎల్‌ఓలే స్వయంగా అందించాలి: సీఈవో సుదర్శన్‌ రెడ్డి

సినిమా సీన్‌ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్‌ను..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 07:24 AM