పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:51 PM
తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కోల్కతా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ కోల్కోతా పోలీసులు శనివారం సుమోటాగా మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేసు నమోదైంది. తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కోల్కతా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ కోల్కోతా పోలీసులు శనివారం సుమోటాగా మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్లో మమతతో పాటు తృణమూల్ ఛాత్ర పరిషత్ కార్యక్రమ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. సెంట్రల్ కోల్కతాలోని 'క్యాథెడ్రల్ రోడ్'లో కేవలం ఒక వైపు మాత్రమే సభ నిర్వహించుకోవాలని, రెండో వైపు వాహనాల రాకపోకల కోసం ఖాళీగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. కానీ, టీఎంసీ కార్యకర్తలు రోడ్డు మొత్తాన్ని ఆక్రమించడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిర్వాహకులు కోర్టు నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ సేపు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. సభలో పాల్గొన్న మద్దతుదారులు పోలీసు బారికేడ్లను నెట్టివేస్తూ, భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు.
దీనిపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే కారణంతో మమతా బెనర్జీతో పాటు కార్యక్రమ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. దర్యాప్తులో భాగంగా అందరినీ విచారిస్తాము’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
51 ఏళ్ల వయసులో ‘ఫైఫర్’.. 94 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్!
సినిమా సీన్ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్ను..