ఓవర్ స్పీడ్గా వెళ్లొద్దన్న వృద్ధుడు.. యువకుల దారుణం
ABN , Publish Date - May 18 , 2026 | 10:17 AM
హైదరాబాద్లో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. ఫలక్నుమా నుంచి బండ్లగూడకు కారులో వెళ్తున్న 69 ఏళ్ల వాజిద్ అలీ ఖాన్పై యువకులు కత్తితో దాడి చేశారు.
హైదరాబాద్, మే 18: పాతబస్తీ చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద పోకిరీలు రెచ్చిపోయారు. గంజాయి మత్తులో ఓ వృద్ధుడిపై యువకులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. యువకుల దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఫలక్నుమా నుంచి బండ్లగూడకు కారులో వెళ్తున్న 69 ఏళ్ల వాజిద్ అలీ ఖాన్పై ఇద్దరు యువకులు దాడి చేశారు. పల్సర్ వాహనంపై యువకులు అతివేగంతో రోడ్డుపై వెళ్తున్నారు. కారులో వెళ్తున్న వాజిద్ అలీ ఖాన్.. ఆ యువకులను వారించాడు. అతివేగం ప్రమాదకరమని, నెమ్మదిగా వెళ్లాలని వారికి సూచించారు.
గంజాయి మత్తులో ఉన్న యువకులు.. వాజిద్ మాటలు పట్టించుకోకపోగా, ఆగ్రహంతో తిరిగి ఆయనపైనే దాడికి తెగబడ్డారు. వాజిద్పై కత్తితో దాడి చేశారు. అనంతరం కారు తాళాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. యువకుల దాడిలో వాజిద్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని బాధితుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వాజిద్ చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
భారత సెమీకండక్టర్స్కు నెదర్లాండ్స్ దన్ను
హైదరాబాద్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
Read Latest Telangana News And Telugu News