మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు: ఎంపీ లక్ష్మణ్
ABN , Publish Date - Aug 20 , 2026 | 02:57 PM
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎవరు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలన్నారు. తెలంగాణలో ప్రజాపాలన లేదని.. దోపిడి పాలన ఉందని విమర్శించారు. భూదందాలు చేస్తూ ప్రజల భూములను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు నిషేధిత జాబితాలో చేరిందన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన భూములు నిషేధిత జాబితాలో పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణలు చెప్పడం సిగ్గు చేటని ఎంపీ అన్నారు. అధికారులను బాధ్యులుగా చేయడం కాదని.. దీనికి ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 22 ఏ జాబితాను బహిర్గతం చేయాలన్నారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 22 A భూములపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. భూములు నిషేధిత జాబితాలో పెట్టారని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేశారని అన్నారు. తెలంగాణలో భూముల పేరుమీద కుంభకోణాలు, సెటిల్మెంట్, దందాలు బయట పడుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో భూములు కాజేయాలని చూస్తే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉండి పోరాటం చేశారని.. భూములు కాపాడుతామని చెప్పారని గుర్తుచేశారు.
అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రేవంత్ అన్నారని లక్ష్మణ్ తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో అంటే... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాలను నిషేధిత జాబితాలోకి నెట్టిందని విమర్శించారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంత్రులు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాలని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యలు చేసిందన్నారు. ఎవరి ఇళ్లు ఎప్పుడు నిషేధిత జాబితాలోకి వెళ్తుందో అని ప్రజలు భయపడుతున్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో మిలాద్-ఉన్-నబి సెలవు తేదీ మార్పు..
ఎస్సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక
Read Latest Telangana News And Telugu News