హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం.. పోలీసులకు పట్టుబడ్డ రౌడీషీటర్
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:07 AM
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ జావేద్ అనే వ్యక్తి 2018లో జరిగిన మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
హైదరాబాద్, జులై 14: హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ జావేద్ అనే వ్యక్తి 2018లో జరిగిన మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని రౌడీషీటర్ హత్య చేశాడు. ఆపై పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 2020 ఆగస్టులో జావేద్పై నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ) జారీ చేశారు. అప్పటి నుంచి జావేద్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, పోలీసుల కళ్లుగప్పి సంగారెడ్డి జిల్లా చేర్యాలలో బాబా అవతారం ఎత్తాడు రౌడీ షీటర్. ఓ దర్గాలో బాబాగా రౌడీషీటర్ చలామణి అవుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని చాకచక్యంగా జావేద్ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. గాంజా సేవించినట్లు నిర్ధారించారు. మరోవైపు రౌడీషీటర్ వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం మహ్మద్ జావేద్ను సైఫాబాద్ పోలీసులకు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు.
ఇవి కూడా చదవండి...
వియత్నాం బోటు ప్రమాదం.. శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్ వేధింపులు..
Read Latest Telangana News And Telugu News