1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారా.. అయితే జాగ్రత్త..
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:04 PM
సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ వైరల్గా మారింది. చాలా మంది తమ ఫొటోలను 1980 దశకం నాటి ఫొటోలుగా మార్చుకుని సంబరపడిపోతున్నారు. అయితే, ఈ ట్రెండ్ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు.
హైదరాబాద్: సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ వైరల్గా మారింది. చాలా మంది తమ ఫొటోలను 1980 దశకం నాటి ఫొటోలుగా మార్చుకుని సంబరపడిపోతున్నారు. అయితే, ఈ ట్రెండ్ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సాధారణ ఫొటోలను 1980ల నాటి రెట్రో ఫొటోలుగా మార్చుతామంటూ సోషల్ మీడియా ప్రకటనలు, సందేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని శిఖా గోయల్ తెలిపారు. ఉచితంగా లేదా అపరిమితంగా ఎడిటింగ్ సదుపాయం కల్పిస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు పంపే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేస్తే ప్రమాదం తప్పదని ఆమె హెచ్చరించారు. అలాంటి లింకులను ఓపెన్ చేస్తే ఏపీకే ఫైళ్ల ద్వారా నిందితులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఎస్ఎంఎస్, ఓటీపీ, కాంటాక్టులు, బ్యాంకింగ్, ఆర్థిక, వ్యక్తిగత సమాచారం సహా మొబైల్లో భద్రపరిచిన ఇతర సున్నితమైన సమాచారాన్ని నిందితులు దొంగిలించే అవకాశం ఉందన్నారు.
దీని ద్వారా ఆర్థిక మోసాలు, అనధికారిక లావాదేవీలు, గుర్తింపు దుర్వినియోగం వంటి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎస్ఎంఎస్, వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in, వాట్సాప్ నంబర్ 8712672222కు ఫిర్యాదు చేయాలని శిఖా గోయల్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు: సీఎం రేవంత్ ఆదేశం..
ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి: కిషన్ రెడ్డి