Biryani: సెకనుకు 3.25 బిర్యానీల ఆర్డర్లు..
ABN , Publish Date - Jan 08 , 2026 | 09:19 AM
మన హైదరాబాద్ బిర్యానీ మరోసారి అదుర్స్ అనిపించుకుంది. గతేడాది రూ.1.75 కోట్ల బిర్యానీలను హైదరాబాదీలు స్విగ్గీలో ఆర్డర్ చేసేశారని ఆ సంస్థ పేర్కొంది. అర్ధరాత్రి సమయంలోనే 6 లక్షలు ఆర్డర్లు ఈ చికెన్ బిర్యానీకి వచ్చాయి.
- గతేడాది రూ.1.75 కోట్ల విక్రయాలు
- మరోమారు బిర్యానీ రాజధానిగా హైదరాబాద్
- హౌ ఇండియా స్విగ్గీడ్ ఇన్ -2025 నివేదిక విడుదల
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నిస్సందేహంగా బిర్యానీ రాజధాని అని అంటోంది స్విగ్గీ(Swiggy). తమ కలినరీ ఐడెంటిటీకి ప్రతీక అయిన బిర్యానీ పట్ల సగటు హైదరాబాదీ అభిమానం ఎన్నటికీ తగ్గదని మరో మారు నిరూపితమైందని చెబుతున్నది. తమ ప్లాట్ఫామ్పై గత సంవత్సరం రూ.1.75 కోట్ల బిర్యానీలను హైదరాబాదీలు ఆర్డర్ చేసేశారని పేర్కొంది. ప్రతి సెకనుకు 3.25 బిర్యానీ ఆర్డర్లు ఈ నగరంలో జరిగాయని చెబుతున్నది. హౌ ఇండియా స్విగ్గీడ్ ఇన్ 2025 పేరిట ఆ సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో హైదరాబాదీ ఆహార అభిరుచులను గురించి ఆసక్తికరమైన అంశాలెన్నో వివరించింది.

2025లో 175 లక్షల బిర్యానీలను స్విగ్గీపై ఆర్డర్ చేయగా వీటిలోనూ చికెన్ బిర్యానీల ఆర్డర్లే 108 లక్షలట. అర్ధరాత్రి సమయంలోనే 6 లక్షలు ఆర్డర్లు ఈ చికెన్ బిర్యానీకి వచ్చాయి. బిర్యానీలను అనుసరించి వెజ్ దోశలను కూడా నగరంలో ఎక్కువగానే ఆర్డర్ చేశారు. గత సంవత్సరం 39.9 లక్షల ఆర్డర్లు ఈ దోశకు వస్తే, 34 లక్షల ఆర్డర్లు ఇడ్లీకి రావడం విశేషం. వీటితోపాటు హైదరాబాదీలు బూందీ లడ్డూను ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఆ సంస్ధ చెబుతున్నది.
దాదాపు 3.3 లక్షల ఆర్డర్లు లడ్డూకు వస్తే, వాటితోపాటు చాక్లెట్ కేక్, గులాబ్ జామూన్ ఉన్నాయి. సాయంత్రం పూట స్నాక్గా చికెన్ బర్గర్స్ను అత్యధికంగా 6.8 ఆర్డర్లు చేస్తే, దీనిని అనుసరించి చికెన్ ఫ్రై 5.9 లక్షల ఆర్డర్లు ఉన్నాయి. నగరంలో ఫుడ్ ఆర్డరింగ్ పరంగా గ్రూప్ బుకింగ్ ఎక్కువగా ఉన్నది. దేశంలోనే ఈ తరహా ఆర్డరింగ్ నగరం రెండో స్ధానంలో ఉంది. స్విగ్గీ ఫుడ్ ఆర్డర్లు మాత్రమే కాకుండా తమ డైనింగ్ ఔట్ సేవలను కూడా నగరంలో గణనీయంగా వినియోగించుకున్నారని చెబుతున్నది.

గతేడాది హైదరాబాదీలు ఈ సేవల ద్వారా రూ.114.8 కోట్లు ఆదా చేసుకున్నారని, ఇండియాలో ఇది మూడవ అత్యధికం అని వెల్లడించింది. గత ఆగస్టులో ఓ హైదరాబాదీ రూ. 47,106 ఖర్చు చేసి 65 బాక్సుల డ్రైఫ్రూట్ బాక్స్లను బహుమతిగా అందించాడని, దేశంలో ఎవరూ ఇంత మొత్తంలో గిఫ్ట్ బాక్స్ల కోసం ఖర్చు చేయలేదని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News