Share News

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సింధు, ఆయుష్ ఔట్

ABN , Publish Date - Aug 20 , 2026 | 08:20 PM

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ప్రీ-క్వార్టర్‌ ఫైనల్లో ఇరువురు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సింధు, ఆయుష్ ఔట్
PV Sindhu

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ప్రీ-క్వార్టర్‌ ఫైనల్లో ఇరువురు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్‌ జి యీ చేతిలో ఓటమి పాలైంది. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ చైనా షట్లర్‌ అద్భుతంగా పోరాడి సింధుపై విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధు 11-21తో ఓడిపోయింది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న భారత స్టార్‌ 21-15తో గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడినా.. చివరికి వాంగ్‌ జి యీ 21-17తో గేమ్‌ను గెలుచుకుని క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది.


ఆయుష్‌ శెట్టి కూడా ఔట్‌

పురుషుల సింగిల్స్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్‌ శెట్టి కూడా ప్రీ క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించాడు. ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్‌ అల్వీ ఫర్హాన్‌ చేతిలో 19-21, 11-21తో వరుస గేముల్లో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో ఆయుష్‌ ఆరంభంలో ఆధిపత్యం ప్రదర్శించాడు. ఒక దశలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినప్పటికీ.. కీలక సమయంలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో అల్వీ 21-19తో తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లోనూ అల్వీ తన జోరును కొనసాగించాడు. ఆయుష్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా 21-11తో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ప్రపంచ నంబర్‌ వన్‌ షి యూకీని ఓడించి సంచలనం సృష్టించిన ఆయుష్‌.. ప్రీ-క్వార్టర్‌ ఫైనల్‌లోనే తన ప్రయాణాన్ని ముగించాడు.


సాత్విక్‌–చిరాగ్‌పై భారీ ఆశలు

మహిళల, పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గత రెండు రౌండ్లలో ప్రత్యర్థుల నుంచి వాక్‌ ఓవర్లు రావడంతో సాత్విక్‌–చిరాగ్‌ ఇప్పటివరకు టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న ఈ భారత జోడీ.. తమ టైటిల్‌ వేటను ఎలా ప్రారంభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 20 , 2026 | 08:20 PM