Share News

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ మిస్సింగ్.. కారణం ఇదేనా?

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:33 PM

టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌కు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కనిపించకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ మిస్సింగ్.. కారణం ఇదేనా?
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కనిపించకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.


‘ఒకసారి నేను క్రికెట్ నుంచి తప్పుకుంటే.. కొంతకాలం పాటు ఎవ్వరికీ కనిపించను..’ ఓ సందర్భంలో విరాట్ చెప్పిన మాటలివి. కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ లండన్‌లో తన కుటుంబంతో స్థిరపడ్డాడు. వారితో సమయం గడిపేందుకే ఈ ఫైనల్ మ్యాచ్‌కు రాలేదని అభిమానులు అనుకుంటున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్‌ను కెప్టెన్‌గా గెలిపించలేదు. అందుకే ఫైనల్‌కు అధికారిక అతిథిగా రాలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ధోనీ, రోహిత్‌లకు ప్రత్యేక ఆహ్వానం

టీమిండియా టీ20 వరల్డ్‌ కప్ విజేతలుగా నిలిపిన మాజీ కెప్టెన్లుగా ధోనీ, రోహిత్‌ శర్మలకు ఈ ఫైనల్‌కు ప్రత్యేక ఆహ్వానం లభించింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ను ధోనీ విజేతగా నిలిపితే.. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా మళ్లీ టైటిల్ సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ అధికారిక అతిథులుగా స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ముగిశాకే వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు: గౌతమ్ గంభీర్

పశ్చిమాసియాలో యుద్ధం.. శ్రీలంక-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దు

Updated Date - Mar 10 , 2026 | 03:33 PM