Share News

ఈ ఇద్దరూ లేకుండానే..

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:22 PM

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ.. భారత జట్టుకు మూలస్తంభాలు. యువ ఆటగాళ్లుగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తమదైన ముద్రవేస్తూ దేశం గర్వించదగిన క్రికెటర్లుగా ఎదిగారు.

ఈ ఇద్దరూ లేకుండానే..

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ.. భారత జట్టుకు మూలస్తంభాలు. యువ ఆటగాళ్లుగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తమదైన ముద్రవేస్తూ దేశం గర్వించదగిన క్రికెటర్లుగా ఎదిగారు. అయితే, గత 18 ఏళ్లుగా ప్రముఖ టోర్నీల్లో వీరిద్దరిలో ఎవరో ఒకరి ఆటను ఆస్వాదిస్తున్న అభిమానులు.. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఇద్దరినీ మిస్‌ కానున్నారు. 2007 ఆరంభ టీ20 ప్రపంచకప్‌ నుంచి మెగా టోర్నీలో ఆడుతున్న రోహిత్‌.. మ్యాచ్‌ విన్నర్‌గా ఎదిగాడు. 2012 నుంచి పొట్టికప్‌లో ఆడుతున్న విరాట్‌ చేజ్‌ మాస్టర్‌గా తనదైన ముద్ర వేశాడు. 2024లో టీమిండియాను విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన రో-కో.. ఆ ఆనంద క్షణాల్లోనే పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. తమ గొప్ప వారసత్వాన్ని నవతరం చేతుల్లో పెట్టారు. ఇప్పుడిక ఈ వరల్డ్‌కప్‌తో భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం ఆరంభం కానుంది. అయితే, రో-కో లేని మెగా టోర్నీని ఫ్యాన్స్‌ ఎలా ఆస్వాదిస్తారో..!


తొలి టీ20 వరల్డ్‌కప్‌లోనే..

2007లో జరిగిన ఆరంభ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ సొంతం చేసుకొంది. అయితే, ఆ టోర్నీలో 20 ఏళ్ల రోహిత్‌ మిడిలార్డర్‌ ఆడుతూ ఆకట్టుకొన్నాడు. కెరీర్‌ ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిని సైతం ఎదుర్కొని ధైర్యంగా నిలబడడం రోహిత్‌పై నమ్మకాన్ని పెంచింది. 2009, 2010 ఈవెంట్లలో టీమిండియా సూపర్‌-8లో వెనుదిరిగినా.. రోహిత్‌ మాత్రం జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు.


ఇద్దరూ కలసి..

2012లో శ్రీలంకలో జరిగిన టోర్నీలో తొలిసారి రోహిత్‌, కోహ్లీ కలసి ఆడారు. ఇక్కడి నుంచి పుష్కరంపాటు వీరిద్దరూ టైటిల్‌ కోసం తీవ్రంగా పోరాడారు. కోహ్లీ కెప్టెన్సీలో కూడా టీమిండియా టైటిల్‌ నెగ్గలేక పోయింది. ఆ తర్వాత రోహిత్‌ పగ్గాలందుకోవడంతో పరిస్థితులు మారతాయని భావించారు. కానీ, 2022లోనూ నిరాశే ఎదురైంది. అయితే, సూపర్‌-12లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ హీరోచిత పోరాటం అభిమానులకు చిరకాల జ్ఞాపకం. ఆ మ్యాచ్‌ నెగ్గినా.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన భారత్‌ ఇంటిముఖం పట్టింది. 2024లో వెస్టిండీస్‌లో జరిగిన పొట్టికప్‌లో రో-కో హయాంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. సూపర్‌-8లో ఆస్ట్రేలియాపై రోహిత్‌ 92 పరుగులతో అదరగొట్టగా.. ఫైనల్లో కోహ్లీ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎప్పుడైతే ట్రోఫీని గర్వంగా పైకెత్తారో.. అప్పుడే గ్రాండ్‌గా టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అభిమానుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు.


నిలకడ.. పోరాటం

2012-2024 మధ్య ఆరు టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఆడిన కోహ్లీ.. నిలకడతోపాటు పోరాటపటిమను చాటాడు. 33 ఇన్నింగ్స్‌లో 58.7 సగటు, 128.81 స్ట్రయిక్‌ రేట్‌తో 1292 పరు గులు సాధించాడు. అత్యధికం 89 పరుగులు కాగా.. 15 అర్ధ శతకాలు నమోదు చేశాడు డేంజరస్‌ హిట్టర్‌..

తొమ్మిది టీ20 ప్రపంచకప్‌ల్లో ఆడిన రోహిత్‌.. ఆటగాడిగా, కెప్టెన్‌గా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడాడు. 44 ఇన్నింగ్స్‌లో 34.9 సగటు, 132.9 స్ట్రయిక్‌ రేట్‌తో 1220 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 92 పరుగులు కాగా.. 12 అర్ధ శతకాలు నమోదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు

ఆర్ఎస్ఎస్‌‌ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్‌ ఖాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2026 | 01:26 PM