స్కాట్లాండ్కు కలిసొచ్చింది..
ABN , Publish Date - Feb 08 , 2026 | 08:38 AM
వరల్డ్కప్నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్ మెగా టోర్నీని బాయ్కాట్ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం ఇచ్చింది.
టీ20 వరల్డ్కప్నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్ మెగా టోర్నీని బాయ్కాట్ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం ఇచ్చింది. దీంతో ఏడోసారి వరల్డ్కప్ ఆడే అవకాశం చేజిక్కించుకొంది. 2007, 2009, 2016, 2021, 2022, 2024ల్లో స్కాట్లాండ్ పొట్టికప్లో పాల్గొంది. అత్యుత్తమంగా 2021లో సూపర్-12కు చేరింది. 2024లో నెట్ రన్రేట్ తక్కువగా ఉండడంతో త్రుటిలో సూపర్-8కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. అయితే, ఈసారి యూరోపియన్ రీజినల్ క్వాలిఫయర్స్లో ఇటలీ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిన స్కాట్లాండ్ నాలుగో స్థానంతో సంతృప్తి చెందింది. ఇక తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఇటలీ, నెదర్లాండ్స్ పొట్టికప్ బెర్త్లు పట్టేశాయి. కానీ, బంగ్లాదేశ్ జట్టు వైదొలగడంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో 14వ స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు జాక్పాట్ తగిలింది.
పెద్ద జట్లకు పారాహుషార్..
గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్తో స్కాట్లాండ్ ఆడనుంది. తమకంటే బలమైన జట్లకు షాకిచ్చిన చరిత్ర స్కాట్లాండ్ సొంతం. 2021లో బంగ్లాదేశ్, 2022లో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఇక, 2024లో ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పనిచేసింది. ఈసారి అనూహ్యంగా చాన్స్ పట్టేసిన స్కాట్లాండ్ ఎవరికి ఝలక్ ఇస్తుందో చూడాలి. గ్రూప్లో ఇంగ్లండ్, వెస్టిండీస్లలో ఒక్కరికి షాకిచ్చినా చాలు.. స్కాట్లాండ్ సూపర్-8 అవకాశాలు బలపడతాయి.
అనుభవజ్ఞుడైన కెప్టెన్..
ఆల్రౌండర్ రిచీ బెరింగ్టన్ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టును స్కాట్లాండ్ ప్రకటించింది. వీరిలో 11 మంది గత టోర్నీలో ఆడిన వారే కావడం విశేషం. కెప్టెన్ బెరింగ్టన్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. 2007లో అరంగేట్రం నుంచి అతడు 300 మ్యాచ్ల్లో 8 వేల పరుగులు సాధించాడు. 100 వికెట్లు పడగొట్టాడు. ఇక వికెట్ కీపర్/బ్యాటర్ అయిన మాథ్యూ క్రాస్ మరో ప్రధాన ఆటగాడు. బ్రాడ్లీ క్యూరీ పేస్ విభాగానికి నాయకత్వం వహించనుండగా.. యువ పేసర్ జైనుల్లా ఇహ్సాన్ తొలిసారి జట్టులోకి వచ్చాడు.

ఎంత ప్రైజ్మనీ రావచ్చు?
టోర్నీలో ఆడినందుకు ఆయా బోర్డులకు ఐసీసీ రూ. 2.75 కోట్ల నుంచి 4.60 కోట్ల వరకు చెల్లిస్తుంది. అంతేకాకుండా ప్రపంచకప్లో నెగ్గిన ప్రతీ మ్యాచ్కు చెల్లించే రూ.30 లక్షలు అదనం.
సూపర్-8కు చేరుకోలేకపోయినా..
నేపాల్, ఇటలీపై స్కాట్లాండ్ నెగ్గే చాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ దాదాపు రూ. 5.50 కోట్ల వరకు ప్రైజ్మనీని పొందే అవకాశాలున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి గుడ్న్యూస్.. నిలకడగా ధరలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్ ఖాన్
Read Latest Telangana News and National News