Share News

ఫిఫా ప్రపంచ కప్: భారత సంతతి ఆటగాడి అరుదైన ఘనత

ABN , Publish Date - Jun 16 , 2026 | 06:09 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో న్యూజిలాండ్ ప్లేయర్ సర్‌ప్రీత్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్న తొలి భారత సంతతి ఆటగాడిగా నిలిచాడు.

ఫిఫా ప్రపంచ కప్: భారత సంతతి ఆటగాడి అరుదైన ఘనత
Sarpreet Singh

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో న్యూజిలాండ్ ప్లేయర్ సర్‌ప్రీత్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్న తొలి భారత సంతతి ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున బరిలోకి దిగిన అతడు ఇరాన్‌పై జరిగిన మ్యాచ్ మొత్తం ఆడి చరిత్ర సృష్టించాడు.


సర్‌ప్రీత్ సింగ్ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జన్మించాడు. అయితే అతడి తల్లిదండ్రుల స్వస్థలం పంజాబ్. 27 ఏళ్ల ఈ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌ను న్యూజిలాండ్ కోచ్ డార్రెన్ బెజెలీ ఇరాన్‌తో కీలక మ్యాచ్‌లో స్టార్టింగ్ ఎలెవన్‌లోకి ఎంపిక చేశాడు. నంబర్ 10 జెర్సీలో బరిలోకి దిగిన సర్‌ప్రీత్.. 90వ నిమిషం వరకు మైదానంలో కొనసాగాడు. ఇరాన్ గోల్‌పోస్ట్‌పై మూడుసార్లు ప్రయత్నాలు చేయగా.. 61వ నిమిషంలో చేసిన షాట్ గోల్ కీపర్‌ను దాటలేకపోయింది. చివరకు ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.


నిషాన్ వెలుపిళ్లై కూడా..

అంతకుముందు భారత సంతతి ఆటగాడు నిషాన్ వెలుపిళ్లై ఆస్ట్రేలియా తరఫున ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేశాడు. కానీ తుది జట్టులో కాకుండా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. దీంతో స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న తొలి భారత సంతతి ప్లేయర్‌గా సర్‌ప్రీత్ సింగ్ రికార్డు నెలకొల్పాడు. ఇక వరల్డ్‌ కప్‌లో భారత మూలాలు కలిగిన ఆటగాళ్లలో వికాస్ ధోరసూ పేరు ముందుగా వినిపిస్తుంది. 2006లో ఫ్రాన్స్ తరఫున ఆడిన అతడి కుటుంబ సభ్యుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం. అయితే అతడు రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగాడు.


భారత్‌తో ప్రత్యేక అనుబంధం..

సర్‌ప్రీత్‌కు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2018లో ముంబైలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో న్యూజిలాండ్ తరఫున ఆడిన అతడు.. భారత్‌పై రెండు అసిస్టులు అందించాడు. అయితే ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలివగా.. న్యూజిలాండ్ మూడో స్థానానికి పరమితమైంది. సర్‌ప్రీత్ కెరీర్‌లో మరో విశేషం ఏమిటంటే.. 2019లో బేయర్న్ మునిచ్ తరఫున మ్యాచ్ ఆడిన తొలి భారత సంతతి ఫుట్‌బాలర్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అనంతరం పోర్చుగల్, సెర్బియా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించిన అతడు ప్రస్తుతం మళ్లీ న్యూజిలాండ్‌లో క్లబ్ ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. ఇదిలా ఉండగా, ఈ వరల్డ్‌ కప్‌లో భారత మూలాలు కలిగిన మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఖతార్ జట్టులో తాహ్సిన్ మహ్మద్ జామ్‌షిద్, డీఆర్ కాంగో జట్టులో సామ్యూల్ చోటు దక్కించుకున్నారు. అయితే ఇప్పటివరకు వారిద్దరూ ఇంకా బరిలోకి దిగలేదు.


ఇవి కూడా చదవండి:

సెరెనా విలియమ్స్ రీఎంట్రీ.. సోదరి వీనస్‌తో వింబుల్డన్‌లో బరిలోకి!

నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

Updated Date - Jun 16 , 2026 | 06:09 PM