Share News

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. పీవీ సింధు శుభారంభం

ABN , Publish Date - Aug 17 , 2026 | 07:59 PM

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై సింధు 21-7, 21-11 తేడాతో సునాయస విజయం సాధించింది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. పీవీ సింధు శుభారంభం
PV Sindhu

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. ఢిల్లీ వేదికగా నేడు మొదలైన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై సింధు 21-7, 21-11 తేడాతో సునాయస విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది.


ప్రపంచ 9వ ర్యాంకర్‌గా బరిలోకి దిగిన సింధు.. 21 ఏళ్ల సోఫియా నోబెల్‌తో తొలిసారి తలపడింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. వరుస పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. దీంతో తొలి గేమ్‌లో నోబెల్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని సింధు.. 21-7తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ను కూడా సింధు నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ప్రారంభించింది. అయితే నోబెల్‌ పుంజుకునే ప్రయత్నం చేసింది. వేగాన్ని మార్చి వరుసగా పాయింట్లు సాధించడంతో కొంతసేపు పోటీ హోరాహోరీగా సాగింది. అయినప్పటికీ కీలక దశలో సింధు తన అనుభవాన్ని చూపించింది. వరుసగా ఏడు పాయింట్లు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. చివరకు 21-11తో రెండో గేమ్‌ను కూడా గెలుచుకుని మ్యాచ్‌ను 2-0తో ముగించింది. దీంతో మహిళల సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 64ను విజయంతో అధిగమించింది.


డబుల్స్‌ విభాగంలో..

మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జంట తొలి రౌండ్‌లో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. ఈ జోడీ వరుస గేమ్‌ల్లో 21-9, 21-13 తేడాతో స్పెయిన్‌కు చెందిన పౌలా-లూసియా జంటను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్- హరిహరన్ జంట కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.


ఇవి కూడా చదవండి:

టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా

టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం

Updated Date - Aug 17 , 2026 | 08:00 PM