Lalremruta Heart Attack: క్రికెట్లో విషాదం.. మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటుతో ప్లేయర్ మృతి
ABN , Publish Date - Jan 08 , 2026 | 09:42 PM
భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. మిజోరంకు చెందిన 38 ఏళ్ల లాల్రెమ్రుటా గుండెపోటుతో మృతి చెందాడు. మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లాల్రెమ్రుటా మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు
స్పోర్ట్స్ డెస్క్: మిజోరంలో ఓ క్రికెట్ మ్యాచ్లో విషాదం నెలకొంది. మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటుకు గురై 38 ఏళ్ల క్రికెటర్ ప్రాణాలు కోల్పోయాడు. మిజోరంకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కె. లాల్రెమ్రుటా హార్ట్ ఎటాక్(Lalremruta heart attack)తో మరణించిట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం(సీఏఎం) ధ్రువీకరించింది. ప్రస్తుతం ఐజ్వాల్కు సమీపంలోని సిహ్ముయ్లో సెకండ్ డివిజన్ స్క్రీనింగ్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.
ఈ టోర్నీలో వెంగ్నువాయ్ రైడర్స్ క్రికెట్ క్లబ్కు లాల్రెమ్రుటా ప్రాతినిథ్యం వహింస్తున్నాడు. ఇవాళ(గురువారం)వెంగ్నువాయ్ రైడర్స్, చాన్పుయ్ క్రికెట్ క్లబ్ తలపడ్డాయి. అయితే మ్యాచ్ జరుగుతుండగా లాల్రెమ్రుటా మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లాల్రెమ్రుటా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లాల్రెమ్రుటా మృతి పట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
లాల్రెమ్రుటా(Lalremruta) మృతిపై సీఏఎం ఓ ప్రకటన విడుదల చేసింది. అతడు రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్లలో మిజోరంకు ప్రాతినిధ్యం వహించాడని, అదేవిధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఏడు మ్యాచ్లు ఆడాడని తెలిపింది. రాష్ట్ర స్ధాయిలో కూడా చాలా మ్యాచ్లలో తన ప్రతిభను చాటుకున్నాడని, మిజోరం ఒక గొప్ప క్రికెటర్ను కోల్పోయిందని వెల్లడించింది. లాల్రెమ్రుటా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని సీఏఎం పేర్కొంది. మిజోరం(Mizoram) క్రీడా శాఖా మంత్రి లాల్గింగ్లోవాహ్మర్ కూడా ఈ యువ ప్లేయర్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Punjab vs Mumbai: ఉత్కంఠ పోరులో పంజాబ్ సంచలన విజయం..
Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..