కోల్కతాలో మెస్సి విగ్రహం తొలగింపు.. ఎందుకంటే?
ABN , Publish Date - Jun 02 , 2026 | 07:16 AM
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా లేక్టౌన్ ప్రాంతంలో ఆరునెలల క్రితం స్వయంగా మెస్సినే వచ్చి ఈ విగ్రహావిష్కరణ చేసిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా లేక్టౌన్ ప్రాంతంలో ఆరునెలల క్రితం స్వయంగా మెస్సినే వచ్చి ఈ విగ్రహావిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. ఈదురుగాలులకు విగ్రహం ఊగుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
గతేడాది డిసెంబర్లో మెస్సి ‘గోట్ టూర్’ సందర్భంగా 27 రోజుల వ్యవధిలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని చేతబట్టి ఉన్న మెస్సి విగ్రహం వీఐపీ రోడ్డు పక్కన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇటీవల బలమైన గాలులు వీచినప్పుడు విగ్రహం ఊగిపోతున్నట్లు స్థానికులు గమనించి ప్రజా పనుల శాఖ (PWD) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పరిశీలన చేపట్టగా, విగ్రహ నిర్మాణ స్థిరత్వంలో లోపాలు ఉన్నట్లు తేలింది. ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో వెంటనే దానిని తొలగించాలని నిర్ణయించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే శరద్వాత్ ముఖర్జీ స్పందించారు. ‘మెస్సి విగ్రహం సురక్షితంగా లేదని గుర్తించాం. గాలులకు అది ఊగుతున్నట్లు కనిపించింది’ అని తెలిపారు. అయితే ఈ విగ్రహాన్ని పూర్తిగా తొలగించడం లేదని.. మరో అనువైన ప్రదేశంలో మళ్లీ ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం.
అన్నీ వివాదాలే..
మెస్సి భారత పర్యటన నిర్వహణపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్’ ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్త, మాజీ క్రీడాశాఖ మంత్రి అరుప్ బిస్వాస్పై టికెట్ల దుర్వినియోగం, యాక్సెస్ కార్డుల జారీ విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు కోల్కతాలో మెస్సి కార్యక్రమం కూడా గందరగోళానికి దారితీసింది. భారీ ధరలకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల్లో పలువురు మెస్సిని దగ్గరగా చూడలేకపోయామని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బాటిళ్లు విసరడంతో పాటు స్టేడియంలోని గేట్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. మరికొందరు నిషేధిత ప్రాంతాల్లోకి చొరబడేందుకు యత్నించగా, టెంట్లు, గోల్పోస్టులు కూడా ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్
ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం