ఫస్ట్ మ్యాచ్లో సూర్యవంశీ లేడని తెలిసి నా భార్య ఆశ్చర్యపోయింది: శ్రీకాంత్
ABN , Publish Date - Sep 15 , 2026 | 09:49 AM
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ మొదటి మ్యాచ్లో 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంపై ఇండియన్ టీం మేనేజ్మెంట్ తీరును మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమచారి శ్రీకాంత్ తప్పుపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ మొదటి మ్యాచ్లో 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంపై గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఇండియన్ టీం మేనేజ్మెంట్ తీరును మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమచారి శ్రీకాంత్ తప్పుపట్టారు. జింబాబ్వేపై గత టీ20 సిరీస్లో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచినా.. ప్రస్తుత సిరీస్ మొదటి మ్యాచ్లో అతడిని బెంచ్కే పరిమితం చేయడం కరెక్టు కాదని ఆయన విమర్శించారు. సంజూ శాంసన్ కోసం సూర్యవంశీని తొలగిస్తారా అని నిలదీశారు. ‘వైభవ్ను పక్కనపెట్టి సంజూను తీసుకున్నా పెద్దగా ఉపయోగం లేదు. అతను10 పరుగులు మాత్రమే చేశాడు. వైభవ్ను జట్టు మేనేజ్మెంట్ ట్రీట్ చేస్తున్న తీరు బాలేదు. అలాగే, సంజూను కూడా మేనేజ్మెంట్ సరిగా హ్యాండిల్ చేయడం లేదు. ఇక సూర్యవంశీని పక్కన పెట్టిన విషయం తెలిసి నా భార్య ఆశ్చర్యపోయింది.
ఫస్ట్ మ్యాచ్లో సూర్యవంశీ ఆడకపోవడంతో మేము ఆ మ్యాచ్ చూడకుండా మూవీ చూశాం’ అని శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నారు. గత మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన ఆటగాడిని ఆడించకపోవడం ఏందని తన భార్య తనతో వాగ్వాదానికి దిగిందని తెలిపారు. వైభవ్ను తప్పించడాన్ని ఆమె పూర్తిగా తప్పుపట్టిందని వెల్లడించారు. ‘సూర్యవంశీని మేనేజ్మెంట్ సరిగా ట్రీట్ చేయడం లేదు. తాను స్కోర్ చేయకపోతే తనను తర్వాతి మ్యాచ్లో తీసేస్తారా అని అతను ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇది అతనికి తప్పుడు సంకేతాలు పంపడమే అవుతుంది. అంతేకాకుండా ప్లేయర్లందరి మనసులో సందేహాలు కలిగించినట్లవుతుంది. ఐపీఎల్తో పాటు దులీప్ ట్రోఫీ, టీ20 ఇంటర్నేషనల్స్, ఇండియా-ఏలో వైభవ్ బాగా రాణించాడు. అతడిని ప్రోత్సహించాలి’ అని శ్రీకాంత్ అన్నారు. ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచినా సంజూను జట్టులోకి తేవడం, పక్కనపెట్టడం వంటివి చేస్తున్నారని, ఇది కూడా కరెక్టు కాదన్నారు.
Also Read:
తెలంగాణ అరాచకత్వం అంచున ఉంది.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఇరాన్తో యుద్ధం ముగిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్
మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్తో అయ్యన్నపాత్రుడు భేటీ