ప్లే ఆఫ్స్కు ముందు కేకేఆర్కు షాక్.. ఐపీఎల్ను వీడిన రచిన్ రవీంద్ర
ABN , Publish Date - May 15 , 2026 | 05:03 PM
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ రసవత్తరంగా మారిన నేపథ్యంలో.. కేకేఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ రచిన్ రవీంద్ర ఐపీఎల్ను వీడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. మే 24తో లీగ్ స్టేజ్ మ్యాచ్లు ముగియనున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ రసవత్తరంగా మారిన నేపథ్యంలో.. కేకేఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ రచిన్ రవీంద్ర ఐపీఎల్ను వీడాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సిద్ధమవ్వడం కోసం రచిన్ న్యూజిలాండ్కు తిరిగి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
‘న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు రచిన్ రవీంద్ర స్వదేశానికి తిరిగి వెళ్లాడు’ అని ఫ్రాంచైజీ పేర్కొంది. మే 27 నుంచి న్యూజిలాండ్.. ఐర్లాండ్తో ఏకైక టెస్టు, జూన్ 4 నుంచి ఇంగ్లండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందులో రచిన్ రవీంద్ర పాల్గొననున్నాడు. శనివారం కోల్కతా జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపడనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ సీజన్ వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ అతడిని రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో గ్రీన్ వంటి విదేశీ ప్లేయర్లు ఆడుతుండటంతో రచిన్కు ఈ సీజన్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారుతున్న తరుణంలో రచిన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఈ సీజన్లో కేకేఆర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఆరు మ్యాచ్ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ప్రస్తుతం తొమ్మిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
2027 ప్రపంచ కప్.. అలాంటి పరిస్థితే వస్తే నేను ఆడను: విరాట్ కోహ్లీ
వరుస మ్యాచ్లకు హార్దిక్ దూరం.. స్పందించిన ముంబై ఇండియన్స్