సోదరి మృతి.. కన్నీళ్లను ఆపుకుని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్!
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:31 PM
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు ముందు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ బాధను దిగమింగుకుని ఇషాన్.. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ విజయాన్ని తన సోదరికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడటం ప్రతి క్రికెటర్ కల. అలాంటిది మ్యాచ్కు ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దు:ఖం వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇషాన్ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఈ విజయాన్ని రోడ్డు ప్రమాదంలో మరణించిన కజిన్ సిస్టర్కు అంకితమిస్తున్నట్లు తెలిపాడు.
‘ఫైనల్ మ్యాచ్కు ముందు శుక్రవారం రోజు మా కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె కోసమే నేను బాగా ఆడాను. హార్దిక్ పాండ్యతో ఈ విషయం చెప్పాను. అతడి ప్రోత్సాహంతో జట్టుకు ప్రాధాన్యమిచ్చాను. మహిళా దినోత్సవం రోజున వచ్చిన ఈ విజయాన్ని ఆమెకు అంకితమిస్తున్నా’ అని ఇషాన్ కిషన్ అన్నాడు. అలాగే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్ తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి కూడా ఇషాన్ మాట్లాడాడు. ‘సూర్య భాయ్ నాకు కాల్ చేసి ‘ప్రపంచ కప్ గెలిపిస్తున్నావా? లేదా?’ అని అని అడిగాడు. దానికి ‘మీరు నమ్ముతున్నారా? లేదా?’ అని అడిగా. ‘నమ్ముతున్నా’ అని సూర్య భాయ్ సమాధానిమిచ్చాడు’ అని ఇషాన్ పేర్కొన్నాడు.
ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్, ఆమె భర్త మార్చి 6న కారు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద ఘటనతో ఫైనల్ మ్యాచ్కు రావాల్సిన ఇషాన్ కుటుంబసభ్యులు అక్కడే ఉండిపోయారు. న్యూజిలాండ్పై హాఫ్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ బ్యాట్ను ఆకాశం వైపు చూపిస్తూ తన సోదరికి నివాళులర్పించాడు. కాగా ఈ ప్రపంచ కప్ ఫైనల్లో ఇషాన్ కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 54 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ టోర్నీలో 9 మ్యాచుల్లో 317 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్
మా ఓటమికి అదే ప్రధాన కారణం: శాంట్నర్