హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ సింగ్
ABN , Publish Date - Jul 21 , 2026 | 02:21 PM
హాకీ పురుషుల ప్రపంచ కప్ 2026 కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనున్న ఈ టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: హాకీ పురుషుల ప్రపంచ కప్ 2026 కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనున్న ఈ టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. డిఫెండర్ హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. సీనియర్ మిడ్ ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ కీలక బాధ్యతలు నిర్వహించనున్నాడు.
ఇటీవల యూరప్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో పాల్గొన్న 24 మంది జట్టులో నుంచి టోర్నీ నిబంధనల ప్రకారం నలుగురిని తప్పించారు. డిఫెండర్ అమన్దీప్ లాక్రా, మిడ్ఫీల్డర్లు రాజ్కుమార్ పాల్, రబిచంద్ర సింగ్ మొయిరంగ్థెమ్, ఫార్వర్డ్ సెల్వం కార్తీలకు తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రొ లీగ్లో భారత్ నిరాశాజనక ప్రదర్శన చేసింది. మొత్తం 16 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, ఐదు డ్రాలు, ఏడు ఓటములతో తొమ్మిది జట్లలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి వరల్డ్ కప్లో మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. 1975లో కౌలాలంపూర్లో పాకిస్థాన్ను ఓడించి ఏకైక ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత విజేతగా నిలవలేదు. 1971లో కాంస్యం, 1973లో రజత పతకాలు సాధించిన భారత జట్టు.. 2023 వరల్డ్కప్లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
భారత్.. పూల్ డిలో ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్ జట్లతో తలపడనుంది. గ్రూప్ దశ మ్యాచ్లన్నీ నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్లో జరుగుతాయి. ఆగస్టు 15న వేల్స్తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. ఆగస్టు 17న ఇంగ్లండ్తో, ఆగస్టు 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.
భారత జట్టు:
గోల్కీపర్లు: మొహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కేరా
డిఫెండర్లు: జర్మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్దీప్ సివాచ్
మిడ్ఫీల్డర్లు: మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నిలకంఠ శర్మ, రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలాగే
ఫార్వర్డ్స్: మన్దీప్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, శిలానంద్ లాక్రా.
ఇవి కూడా చదవండి:
స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ.. దర్యాప్తు చేపట్టిన ఫిఫా
స్వదేశానికి చేరుకున్న అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్లు.. మెస్సి మాత్రం!