ఏ జట్టు సంస్థ కంటే పెద్దది కాదు.. ప్రపంచ కప్ బహిష్కరణ డ్రామాపై జైషా ఆగ్రహం
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:29 AM
పొట్టి ప్రపంచ కప్ 2026లో తాము పాల్గొనబోమంటూ బంగ్లా మొండి వైఖరిని ప్రదర్శించింది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా వరల్డ్ కప్ ఆడబోమని పాక్ సరికొత్త డ్రామా చేసింది. ఈ హైడ్రామాపై ఎట్టకేలకు ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందించారు. ఆ జట్లపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రాజకీయ ఉద్రిక్తతల నడమ ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తప్పించిన విషయం తెలిసిందే. అక్కడ మొదలైన వివాదం టీ20 ప్రపంచ కప్ 2026 వరకు కొనసాగుతూ వచ్చింది. పొట్టి ప్రపంచ కప్లో తాము పాల్గొనబోమంటూ బంగ్లా మొండి వైఖరిని ప్రదర్శించింది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా వరల్డ్ కప్ ఆడబోమని పాక్ సరికొత్త డ్రామా చేసింది. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లా స్థానంలో స్కాట్కాండ్ను ఎంపిక చేసింది ఐసీసీ. టోర్నీలో ఆడేందుకు పాక్ ఎట్టకేలకు ఒప్పుకుంది. ప్లేయర్లంతా ఘోరంగా విఫలమవ్వడంతో సూపర్ 8 దశలోనే ఆ జట్టు నిష్క్రమించింది. ఈ హైడ్రామాపై ఎట్టకేలకు ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందించారు. ఆ జట్లపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జై షా ముంబైలోని ఓ అవార్డు కార్యక్రమంలో ఈ అంశంపై మాట్లాడారు. ‘వరల్డ్ కప్నకు ముందు చాలా హైడ్రామా జరిగింది. ఐసీసీ ఛైర్మన్గా నేను చెప్పేది ఒక్కటే.. ఏ జట్టు అయినా సంస్థ కంటే పెద్దది కాదు. ఒక్క జట్టు వల్ల సంస్థ నిలబడు. అన్ని జట్ల సమ్మేళనమే ఓ సంస్థ. ఈ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి’ అని జై షా అన్నారు. అయితే ఆయన ఎక్కడా బంగ్లాదేశ్, పాకిస్థాన్ పేర్లను ప్రస్తావించలేదు.
తర్వాతి లక్ష్యాలు అవే..
ఈ నేపథ్యంలో జై షా.. టీమిండియా కోచ్ గంభీర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లకు ఓ సందేశం ఇచ్చారు. ‘పై నుంచి కిందికి పడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అది నెలల వ్యవధిలోనే జరుగుతుంది. కానీ కింద నుంచి పైకి వచ్చి విజయాలు సాధించిడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కష్టపడి పని చేస్తూ విజయాలు కొనసాగించాలి. 2030, 2031, 2036 టోర్నీల లక్ష్యాలతో మీరు ఇలాగే ముందుకు సాగాలి’ అని సూచించారు.
అద్భుతంగా జరిగింది..
టీ20 ప్రపంచ కప్ 2026 రికార్డు స్థాయిలో విజయవంతమైందని జై షా తెలిపారు. టోర్నమెంట్కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను ఒకేసారి 7.2 మిలియన్ల మంది వీక్షించారని, ఇది ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేసిందన్నారు. అసోసియేట్ జట్లు కూడా అద్భుతంగా పోరాడినట్లు ఆయన పేర్కొన్నారు. ‘అమెరికా జట్టు భారత్కు గట్టి పోటీ ఇచ్చింది. నెదర్లాండ్స్.. పాకిస్తాన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అలాగే జింబాబ్వే.. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును ఓడించి టోర్నీ నుంచే నిష్క్రమించేలా చేసింది. నేపాల్ జట్టు ఇంగ్లాండ్కు సవాల్ విసరడం వంటి సంఘటనలు టోర్నమెంట్ను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయని జై షా వివరించారు.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ బాటలో.. సూపర్ ఫిట్గా మారిన రిషబ్ పంత్
ఐపీఎల్ 2026: టైటిల్కు కేకేఆర్ గట్టి పోటీదారుగా ఉండలేదు.. అనిల్ కుంబ్లే