దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:29 AM
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. ఈ టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నిరాశజనకంగా ముగిసింది.
స్పోర్ట్స్ డెస్క్: ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. ఈ టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నిరాశజనకంగా ముగిసింది. ఈస్ట్ జోన్ తరఫున నార్త్ ఈస్ట్ జోన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ జట్టుకు వైభవ్ వైస్ కెప్టెన్గా ఎంపిక కావడం విశేషం. అయితే మ్యాచ్లో మాత్రం అతడు బ్యాట్తో పెద్దగా రాణించలేకపోయాడు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రెండు అద్భుతమైన బౌండరీలతో మంచి టచ్లో కనిపించినప్పటికీ, ఆ జోరును కొనసాగించలేకపోయాడు. నార్త్ ఈస్ట్ జోన్ పేసర్ బిశ్వోర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్లో కేవలం 6 బంతులు ఆడి పెవిలియన్కు చేరాడు. అయితే, వైభవ్ ఔటై మైదానం వీడుతున్న సమయంలో విచిత్ర సన్నివేశం కనిపించింది. అతడి జెర్సీపై ఉన్న నంబర్కు టేప్ అంటించి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. వైభవ్ జెర్సీపై '3' అనే అంకె మాత్రమే కనిపించేలా టేప్ వేయడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. 3 అంకె కంటే ముందు ఉన్న నంబర్ను టేప్తో కవర్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తరఫున వైభవ్ ‘3’ నంబర్ జెర్సీతోనే మైదానంలోకి దిగుతాడు. అలానే జాతీయ జట్టుకు ఎంపికైనప్పుడు అతడికి 3 నంబర్ నే టీమిండియా మేనేజ్మెంట్ కేటాయించింది. దులీప్ ట్రోఫీలో జెర్సీపై ముద్రించిన నంబర్లో ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ జరిగి ఉండటం వల్ల, లేదా తనకిష్టమైన '3' అంకెను మాత్రమే ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే వైభవ్ ఇలా టేప్ వేసి ఉంటాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. కారణం ఏదైనా వైభవ్కు సంబంధించిన ఈ ఆసక్తికర అంశం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో వైరల్గా మారింది.
ఇవి కూడా చదవండి:
వీరేంద్ర సెహ్వాగ్ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్
నా సెంచరీకి శ్రీలంక ప్లేయర్ కూడా కారణం: జురెల్