Share News

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:15 PM

టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అక్షర్‌ పటేల్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌‌ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై భారత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా స్పందించాడు.

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే
Suryakumar Yadav apology Axar Patel

స్పోర్ట్స్ డెస్క్: స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌(T20 World cup 2026) గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. అలానే వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది. ఇది ఇలాఉంటే తాజాగా టీ20 టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ క్షమాపణలు చెప్పాడు. మరి.. అక్షర్‌కు సూర్య ఎందుకు సారీ చెప్పాడు?. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...


టీ20 ప్రపంచ కప్2026 టోర్నీ లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌ జట్లను టీమిండియా ఓడించింది. అయితే సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో మాత్రం 76 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. టీ20 ప్రపంచ కప్‫లోనే భారత్‌కు ఇది దారుణమైన ఓటమి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ (Axar Patel) స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను ఆడించారు. దీనిపై క్రీడా వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా స్పందించాడు.


'అక్షర్‌ పటేల్‌ ఆరోజు చాలా చాలా కోపంగా ఉన్నాడు. అతడి స్థానంలో ఏ ఆటగాడు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారు. అతడొక అనుభవజ్ఞుడైన ప్లేయర్‌. ఐపీఎల్‌లో ఓ జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. నా వల్లే తప్పు జరిగిందని, నన్ను క్షమించమని అక్షర్‌ను కోరాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే నిర్ణయం తీసుకున్నానని అతడికి వివరించాను. కానీ అతడి కోపం చల్లారలేదు. మరుసటి రోజు వరకు కూడా అతడు నాపై కోపంగానే ఉన్నాడు’ అని సూర్య కుమార్‌ చెప్పుకొచ్చాడు.


ఇక ఈ టోర్నీలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో కేవలం 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు సాధించి.. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌తో పాటు అక్షర్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ల వల్లే ఉత్కంఠ పోరులో టీమిండియాకు విజయం సాధ్యమైంది.


ఇవి కూడా చదవండి:

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వెస్టిండీస్ క్రికెటర్‌కు భారీ షాక్

Updated Date - Mar 12 , 2026 | 05:49 PM