మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వెస్టిండీస్ క్రికెటర్కు భారీ షాక్
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:39 PM
వెస్టిండీస్ క్రికెటర్ జేవన్ సీర్లెస్కు ఐసీసీ భారీ షాకిచ్చింది. సీర్లెస్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో తరచూ మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించిన వార్తలు కలకలం సృష్టిస్తుంటాయి. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడగా.. కొందరు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి వారిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్, కోల్కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ జేవన్ సీర్లెస్(Javon Searles)పై కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో జేవన్ సీర్లెస్కు ఐసీసీ భారీ షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇతడితో మరో ఇద్దరిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. 2023-24కు సీజన్ సమయంలో బార్బడోస్లో జరిగిన బీమ్10 లీగ్లో సీర్లెస్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ వెస్టిండీస్( Cricket West Indies), ఐసీసీ అవినీతి నిరోధక కోడ్లోని ఐదు నిబంధనలను సీర్లెస్ ఉల్లంఘించినట్లు ఐసీసీ గుర్తించింది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేలా జేవన్ వ్యవహరించినట్లు ఐసీసీ విచారణలో వెల్లడైంది.
జేవన్ సీర్లెస్తో పాటు టైటాన్స్ జట్టు యజమాని చిత్రంజన్ రాథోడ్, అధికారి ట్రెవాన్ గ్రిఫిత్పై కూడా తాత్కాలిక నిషేదం పడింది. సీర్లెస్పై అత్యధికంగా నాలుగు అభియోగ పత్రాలు నమోదు కాగా, చిత్రంజన్పై మూడు, గ్రిఫిత్పై ఒక చార్జ్ నమోదైంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించడానికి వీరి ముగ్గురికి 14 రోజుల సమయం ఉందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే బీమ్ టీ10 లీగ్ అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్పై కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఐసీసీ సస్పెన్షన్ విధించింది. దీంతో అతడు ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్2026కు దూరమయ్యాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్2026 ప్రారంభానికి ముందు ధోనికి భారీ ఊరట
ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్