Share News

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:52 AM

ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్2026లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది.

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్
india vs Pakistan 2011 World Cup semifinal

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్(T20 World Cup2026)లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.. టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో 2011 వన్డే ప్రపంచకప్‌లో భార‌త్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను అప్పటి పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. ఆ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.


ఇంటర్వ్యూలో అఫ్రిది(Shahid Afridi) మాట్లాడుతూ..'వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌2011లో మొహాలీలో టీమిండియాతో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మ్యాచ్‌లో మేము చాలా అద్భుతంగా బ్యాటింగ్ ప్రారంభించాము. మా ఓపెనర్లు మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ తొలి వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్‌ను ఓడించడం ఖాయమని చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. కానీ తొలి వికెట్ పడగానే సీన్ మారిపోయింది' అని గుర్తు చేసుకున్నాడు.


'మా తొలి వికెట్ పడగానే స్టేడియంలోని అభిమానులు టీమిండియాను ఉత్సాహపరిచిన తీరు అమోఘం. ఆ కేరింత‌లు, అరుపుల దెబ్బకు మైదానంలో మా బ్యాటర్లు వణికిపోవ‌డం నేను చూశాను. అదే సమయంలో భార‌త్(Team India) తిరిగి అద్భుతంగా పుంజుకుంది. హఫీజ్ ఔటైన తర్వాత, మా బ్యాటర్లు వ‌రుస క్రమంలో పెవిలియ‌న్‌కు చేరారు. ప్రతీ బంతికి ఇబ్బంది పడ్డారు. స్టేడియంలో విపరీతమైన గోల మ‌ధ్య మా ప్లేయ‌ర్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. కనీసం నిలదొక్కునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు' అని అఫ్రిది వెల్లడించాడు.


కాగా 2011 ప్రపంచ కప్‌లో మొహాలి వేదికగా భారత్ , పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం 261 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పాక్ 231 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో29 పరుగుల తేడాతో పాక్ పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 85 ప‌రుగులు చేసిన స‌చిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ప్లేయ‌ర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.


ఇవి కూడా చదవండి:

ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్ 2026లో పాల్గొనం: ఇరాన్‌

హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..

Updated Date - Mar 12 , 2026 | 12:08 PM