Share News

మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!

ABN , Publish Date - May 01 , 2026 | 10:37 AM

శ్రీలంకకు చెందిన ఇద్దరు అండర్‌-19 క్రికెటర్లు ఓ వివాదంలో చిక్కుకున్నారు. హోటల్ బాత్‌రూమ్‌ల్లో లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా వీడియోలు తీశారనే ఆరోపణలపై సదరు ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!
Sri Lanka cricketers arrested

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక క్రికెట్‌లో అరెస్టుల కలకలం రేగింది. ఆ దేశానికి చెందిన ఇద్దరు అండర్‌-19 క్రికెటర్లు ఓ వివాదంలో చిక్కుకున్నారు. హోటల్ బాత్‌రూమ్‌లలో లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా వీడియోలు తీశారనే ఆరోపణలపై సదరు ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.


కొలంబోలోని నారాహెన్‌పిటాలో ఓ హోటల్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌‌కు కొంతమంది మహిళా వైద్యులు హాజరయ్యారు. అయితే తాము స్నానం చేస్తుండగా ఎవరో మొబైల్ ఫోన్లతో రహస్యంగా వీడియోలు తీస్తున్నట్లు వారు గమనించారు. ఈ ఘటనపై సదరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడింది అండర్-19 క్రికెటర్లేనని పోలీసులు తేల్చినట్లు శ్రీలంకకు చెందిన ఓ మీడియా సంస్థ తమ కథనంలో పేర్కొంది.


దీంతో సదరు క్రికెటర్లను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అయితే స్థానిక మెజిస్ట్రేట్ నిందితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ఓ స్పోర్ట్స్ ఛానల్ సమాచారం ప్రకారం... పోలీసుల ద‌ర్యాప్తులో ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పోలీసుల విచారణలో సదరు క్రికెటర్లు మహిళలను మాత్రమే కాకుండా కొంతమంది పురుషుల వీడియోలను కూడా తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలలో ఏవైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అయ్యాయా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. కాగా ఆ యువ క్రికెట‌ర్లు జోసెఫ్, వాజ్‌లుగా పోలీసులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ వివాదంపై శ్రీలంక క్రికెట్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.


ఇవి చదవండి:

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

వారి వల్లే ఈ ఓటమి.. రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - May 01 , 2026 | 11:01 AM