టీ20 డబ్ల్యూసీ: నేడు సౌతాఫ్రికాతో మ్యాచ్.. కివీస్19 ఏళ్ల పగ తీరేనా?
ABN , Publish Date - Mar 04 , 2026 | 08:27 AM
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో మొదటి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాప్రికా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7: 00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో మొదటి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాప్రికా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7: 00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతున్న సఫారీ జట్టు ఒకవైపు ఉంటే.. ఎలాగైనా చరిత్రను తిరగరాయాలని కసితో ఉన్న కివీస్ జట్టు మరోవైపు ఉంది. అలానే సౌతాఫ్రికాపై 19 ఏళ్ల పగ తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. మరి.. ఈ 19 ఏళ్ల పగ ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 ప్రపంచకప్ చరిత్రలో సౌతాఫ్రికాను ఓడించడం న్యూజిలాండ్ జట్టుకు ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. 2007లో జరిగిన మొదటి ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ సఫారీ జట్టు చేతిలో తొలిసారి కివీస్ ఓడిపోయింది. ఇక నాటి నుంచి నేటి వరకు ఈ రెండు జట్లు మెగా టోర్నీలో 5 సార్లు తలపడగా.. అన్నిసార్లూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. అంటే గత 19 ఏళ్లుగా పొట్టి ప్రపంచ కప్లో సఫారీల చేతిలో కివీస్ ఓడుతూనే ఉంది. ఇప్పుడు మిచెల్ శాంట్నర్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టుకు ఈ 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సువర్ణ అవకాశం లభించింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, శాంట్నర్ తన మాయాజాలంతో సౌతాఫ్రికాను దెబ్బకొట్టాలని వ్యూహం రచిస్తున్నాడు. ఇరు జట్లు బలంగా ఉన్నప్పటికీ.. సౌతాఫ్రికానే మెరుగ్గా కనిపిస్తుంది. అయితే చోకర్స్ అనే ముద్ర వారిని వెంటాడుతుంది.
ఈ రెండు జట్ల అంతర్జాతీయ టీ20 రికార్డులను పరిశీలిస్తే, సౌతాఫ్రికా స్పష్టమైన ఆధిపత్యం ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా.. సౌతాఫ్రికా 12 సార్లు, న్యూజిలాండ్ 7 సార్లు విజయం సాధించాయి. చివరగా ఇటీవలే 2026 ప్రపంచకప్ గ్రూప్ దశలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ఈ పాత రికార్డులన్నీ దక్షిణాఫ్రికాకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంటే, న్యూజిలాండ్ కు మాత్రం ఒక రకమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. అయితే, నాకౌట్ మ్యాచ్ల్లో న్యూజిలాండ్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టుగా మారుతుందని మర్చిపోకూడదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
మొత్తంగా కోల్కతా క్రికెట్ అభిమానులు ఈ పోరు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న ఈ రెండు జట్లలో ఎవరు తుదిపోరుకు అర్హత సాధిస్తారో చూడాలి. 19 ఏళ్ల పగను కివీస్ తీర్చుకుంటుందా? లేక సౌతాఫ్రికా తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?