Share News

పాక్ క్రికెటర్లకు చేదు అనుభవం.. హోటల్ వెలుపల నిరసనలు!

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:47 AM

ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్‌ అండర్-19 జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. హోటల్‌లో బస చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారిని అక్రమ వలసదారులుగా భావించి కొందరు నిరసనలకు దిగారు.

పాక్ క్రికెటర్లకు చేదు అనుభవం.. హోటల్ వెలుపల నిరసనలు!
Pakistan U19 team

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ అండర్-19 జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న ఆ జట్టు ఒక మ్యాచ్ కోసం పోర్ట్స్‌మౌత్‌లోని ఓ హోటల్‌కి చేరుకుంది. ఈ క్రమంలో బస్సు దిగుతున్న క్రికెటర్లను చూసిన యాంటీ ఇమిగ్రెంట్ ఉద్యమకారులు.. వారిని అక్రమ వలసదారులుగా భావించారు. ఇక ఒక్కసారిగా 40 మంది వరకు ఆందోళనకారులు అక్కడికి చేరుకొని నిరసనలకు దిగారు. హోటల్ వెలుపల కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే స్పందించిన అధికారులు.. ఆందోళన చేస్తున్న వారికి అసలు విషయం చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.


ఈ ఘటనపై పాక్ అండర్ -19 జట్టు కోచ్‌తో స్థానిక కౌన్సిలర్ జార్జ్‌ మాడ్గివిక్ మాట్లాడారు. అనంతరం ఉద్యమకారులతో కూడా ఆయన చర్చించి పూర్తి వివరాలను తెలిపారు. తాను పాక్ జట్టు కోచ్‌తో మాట్లాడానని, ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారని జార్ట్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆందోళనకారులతో కూడా చర్చించామని, వారు పొరపాటుపడిన విషయాన్ని తెలియజేసినట్లు జార్జ్ వెల్లడించారు. వారంతా క్రికెటర్లని ఆందోళనకారులకు నచ్చజెప్పామని, కొన్ని నిమిషాల అనంతరం వారు వెళ్లిపోయారని పేర్కొన్నారు.


విదేశీయులు ఎవరో హోటల్‌కు వచ్చారని ఆన్‌లైన్‌లో ఒకరు ఫొటోను షేర్ చేయడం, అది ఒక్కసారిగా వైరల్‌గా మారిందని కౌన్సిలర్ తెలిపారు. వాస్తవం తెలుసుకోకుండా ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయొద్దని జార్జ్‌ విజ్ఞప్తి చేశారు. పోర్ట్స్‌మౌత్ నార్త్ ఎంపీ అమందా మార్టిన్ కూడా స్పందించారు. తప్పుడు సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని, ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ అండర్-19 జట్టు ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో ఉంది. పాక్, ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు యూత్ టెస్ట్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. ఆ తర్వాత సెప్టెంబర్ 9న జరిగిన తొలి యూత్ వన్డేలో ఇంగ్లండ్‌పై పాక్ ప్రతికారం తీర్చుకుంది. పాక్ 177 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ అండర్-19 జట్టును చిత్తుగా ఓడించింది.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డు బద్దలు

వావ్‌.. శీతల్‌

Updated Date - Sep 10 , 2026 | 11:55 AM