మరో కొత్త టోర్నీని ప్రారంభించిన పాకిస్థాన్.. పూర్తి వివరాలు ఇవే
ABN , Publish Date - Jul 28 , 2026 | 07:34 AM
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్లో యువ ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే కొత్త టోర్నమెంట్ను పీసీబీ తీసుకొచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలుగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన జట్లు ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అలానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వరల్డ్ కప్2027ను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొత్త ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్2026' అనే సరికొత్త టోర్నీని ప్రారంభించింది. తొలి ఎడిషన్ షెడ్యూల్ను, జట్ల వివరాలను పీసీబీ సోమవారం ప్రకటించింది.
వారాల వ్యవధిలో ముగిసే ఈ 50 ఓవర్ల (లిస్ట్-ఎ) టోర్నమెంట్ ఆగస్టు 11 నుంచి ప్రారంభమై ఆగస్టు 18 వరకు జరగనుంది. ఈ మ్యాచులన్నిటికీ ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో మొత్తం నాలుగు జట్లు(పాకిస్థాన్ గ్రీన్, పాకిస్థాన్ వైట్స్, పాకిస్థాన్ బ్లూస్, పాకిస్థాన్ గోల్డ్) పాల్గొంటుండగా, రౌండ్-రాబిన్ ఫార్మాట్లో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున మొత్తం ఆరు లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆగస్టు 18న జరిగే తుది పోరుకు అర్హత సాధిస్తాయి.
పాకిస్థాన్ కాలమానం ప్రకారం మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతాయి. రాబోయే మెగా టోర్నీ కోసం వైట్-బాల్ క్రికెట్లో యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు కల్పించి, బలమైన జట్టును నిర్మించడానికే ఈ నేషనల్ ఛాంపియన్స్ కప్ను తీసుకొచ్చినట్లు పీసీబీ స్పష్టం చేసింది. కాగా ఈ లిస్ట్-ఎ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్థాన్ అగ్రశ్రేణి ఆటగాళ్లు షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్ పాల్గొనున్నారు. వీరు నలుగురు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
ఇవి కూడా చదవండి: