లిఫ్టర్ల దూకుడు
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:27 AM
కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల పతక జోరు కొనసాగుతోంది. ఆటలకు ఐదో రోజైన సోమవారం లిఫ్టర్లు మరో రెండు పతకాలు అందించారు. జ్ఞానేశ్వరి యాదవ్ రజతం సాధించగా...
లిఫ్టర్ల దూకుడు
జ్ఞానేశ్వరి, రాజాకు రజతాలు
బింద్యాకు కాంస్యం ఫ కామన్వెల్త్ క్రీడలు
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల పతక జోరు కొనసాగుతోంది. ఆటలకు ఐదో రోజైన సోమవారం లిఫ్టర్లు మరో రెండు పతకాలు అందించారు. జ్ఞానేశ్వరి యాదవ్ రజతం సాధించగా.. బింద్యారాణి దేవి కాంస్యం దక్కించుకొంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పోటీలో రాజా ముత్తుపాండి రజతం అందుకున్నాడు. ఇక మహిళల 53 కిలోల విభాగంలో ఓవరాల్గా జ్ఞానేశ్వరి 199 (88+111) కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్లో 88 కిలోలు ఎత్తిన జ్ఞానేశ్వరి క్లీన్ అండ్ జెర్క్లో 111 కిలోలు లేపింది. వాస్తవంగా స్వర్ణం సాధించిన నైజీరియన్ ఒనోవి డిడిహ్, జ్ఞానేశ్వరి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. అయితే, డిడిహ్ మొత్తం 206 (93+113) కిలోలు ఎత్తి కామన్వెల్త్, క్రీడల రికార్డులతో పసిడిని కైవసం చేసుకొంది. కెనడా లిఫ్టర్ రెబెక్కా గ్రోలక్స్ మొత్తం 178 (83+95) కిలోల బరువు ఎత్తి కాంస్యం దక్కించుకొంది. ఇక, పురుషుల 65 కిలోల విభాగంలో స్నాచ్లో 126 కిలోలు ఎత్తిన రాజా.. క్లీన్ అండ్ జర్క్లో 160 కిలోలు లిఫ్ట్ చేశాడు. ఓవరాల్గా 286 కిలోల బరువు లేపి రజతం అందుకున్నాడు. మహిళల 58 కిలోల కేటగిరీలో బింద్యారాణి మొత్తం 199 (87+112) కిలోల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. స్నాచ్లో మూడో ప్రయత్నంలో 87 కిలోలు లిఫ్ట్ చేసిన బింద్యా.. క్లీన్ అండ్ జెర్క్లో 112 కిలోలు ఎత్తింది. నైజీరియా లిఫ్టర్ రఫియాతు మొత్తం 229 (103+126) కిలోలు ఎత్తి గేమ్స్ రికార్డుతో స్వర్ణం, కెనడా అథ్లెట్ అన్నా సోపీ 215 (94+121) కిలోలు లిఫ్ట్ చేసి రజతం సాధించారు.
ఫైనల్కు శ్రీశంకర్..: మురళీ శ్రీశంకర్, లోకేశ్ సత్యనాథన్ లాంగ్ జంప్ ఫైనల్కు అర్హత సాధించారు. గ్రూప్-ఎ అర్హత రౌండ్లో శ్రీశంకర్ 8.38 మీటర్లు దూకాడు. ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్ 8.01 మీటర్లను అధిగమించడంతో మెడల్ రౌండ్కు నేరుగా అర్హత సాధించాడు. గ్రూప్-బి నుంచి బరిలోకి దిగిన లోకేశ్ 7.77 మీటర్లు లంఘించాడు. అయితే, టాప్-12లో నిలవడంతో బుధవారం జరిగే ఫైనల్కు అర్హత సాధించాడు.
తేజస్ రికార్డు..: కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్గా తేజ స్ సిర్సే రికార్డులకెక్కాడు. హీట్1లో తేజస్ 13.76 సెకన్ల టైమింగ్తో మూడో స్థానంలో.. ఓవరాల్గా ఆరో స్థానంలో నిలిచాడు.
క్వార్టర్స్కు సచిన్, అంకుష్, సాక్షి: భారత బాక్సర్లు సచిన్ సివాచ్, అంకుశ్ క్వార్టర్స్కు చేరుకొన్నారు. పురుషుల 60 కిలోల కేటగిరీ ప్రీక్వార్టర్స్లో సచిన్ 4-1తో హెవిట్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. 80 కిలోల రౌండ్-16లో అంకుశ్ 5-0తో జన్ జలాన్ (ఆంటిగ్వా)పై గెలిచాడు. సాక్షి చౌదరి అదిరే విజయంతో క్వార్టర్స్కు చేరుకొంది. మహిళల 51 కిలోల ప్రీక్వార్టర్స్ బౌట్లో సాక్షి 5-0తో లితాబో మొడుకనెలె (బోట్స్వానా)ను మట్టికరిపించింది.
బటర్ఫ్లై ఫైనల్కు సజన్: పురుషుల 200 మీ. బటర్ఫ్లై లో సజన్ ప్రకాశ్, 800 ఫ్రీస్టయిల్లో ఆర్యన్ నెహ్రా, పారా పురుషుల 100 మీ. బ్యాక్స్ట్రోక్ ఎస్బి9లో స్వాతిక్ పాటిల్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
సమంతకు ఏడో స్థానం: ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ మహిళల వాల్ట్ ఫైనల్లో ప్రతిష్ఠ సమంతా ఏడో స్థానంలో నిలిచింది.
వారికే అంకితం..: ముత్తుపాండి
చెన్నై (ఆంధ్రజ్యోతి): వెయిట్ లిఫ్టింగ్లో రజతం సాధించిన రాజా ముత్తుపాండి.. తన పతకాన్ని తల్లిదండ్రులు, కోచ్కు అంకితం ఇస్తున్నట్టు చెప్పాడు. ‘స్వర్ణం సాధిస్తానని కోచ్కు నాపై భారీ అంచనాలున్నాయి. కానీ, వాటిని అందుకోలేక పోవడం నిరాశ కలిగించింది. ఈ పతకం కోచ్, నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నా. భవిష్యత్లో దేశానికి మరిన్ని పతకాలు అందించాలనుకొంటున్నాన’ని రాజా చెప్పాడు.
విజయ్ రూ.30 లక్షల నజరానా
ముత్తుపాండికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రూ.30 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు విజయ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తూత్తుకుడి జిల్లాకు చెందిన రాజా ముత్తుపాండి విజయం భారత యువతకు నూతన స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మాజీ సీఎం స్టాలిన్ కూడా ముత్తుపాండికి శుభాకాంక్షలు చెప్పారు. యువత క్రీడలతో పాటు విద్యారంగంలో కూడా రాణించాలని స్టాలిన్ ఆకాంక్షించారు.
నేటి భారత షెడ్యూల్
అథ్లెటిక్స్: మహిళల హైజంప్ ఫైనల్-పూజ (మ. 11.35); పురుషుల 10,000 ఫైనల్- గుల్వీర్ సింగ్ (రా. 12.55)
వెయిట్ లిఫ్టింగ్: మహిళల 63 కిలోలు-నిరుపమ్ దేవి (సా. 6.30); మహిళల 69 కిలోలు-హర్జీందర్ కౌర్ (రా. 1)
స్విమ్మింగ్: పురుషుల 100 మీ. బ్యాక్ స్ట్రోక్ హీట్స్-శ్రీహరి నటరాజ్ (మ. 2.45); పురుషుల 50 మీ. ఫ్రీస్టయిల్ ఎస్13 హీట్స్- రవి బుడిగిన (రా. 11:57)
బాక్సింగ్: క్వార్టర్స్ మ్యాచ్లు.. ప్రీతి పవార్, ప్రియ ఘంగాస్, పర్వీన్ హుడా, జాదూమణి సింగ్, కపిల్ (రా. 10.30 నుంచి)
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News