వీరేంద్ర సెహ్వాగ్పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్
ABN , Publish Date - May 14 , 2026 | 02:40 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ పొరపాటును టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా పేరును తప్పుగా పలికాడు. దీంతో బుమ్రా అభిమానులు మండిపడుతున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్పై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా అంటే ఎందుకు అంత చులకనంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అసలు బుమ్రా అభిమానులు సెహ్వాగ్పై ఫైర్ కావడానికి కారణం ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముందు వీరేంద్ర సెహ్వాగ్ ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ... ముంబై జట్టులో తోపు ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఓడిపోతున్నారని అన్నాడు. హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్ లాంటి తోపు బౌలర్లు ఉన్నప్పటికీ విరాళంగా పరుగులు ఇస్తున్నారని మండిపడ్డాడు. ఈ క్రమంలోనే పొరపాటున బుమ్రాను 'చుమ్రా' అని సంబోధించాడు. సెహ్వాగ్ వెంటనే తన తప్పును సరిదిద్దుకుని.. తిరిగి బుమ్రా అని అన్నాడు. కానీ ఆ పొరపాటుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలు అయింది. దీంతో బుమ్రా అభిమానులు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'సెహ్వాగ్కు బుమ్రా అంటే ఎందుకంత ద్వేషం?' అని ఓ యూజర్ ఎక్స్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉండగా, నిన్న(బుధవారం) విడుదలైన తాజా ఐసీసీ ర్యాంకింగ్లలో టెస్ట్ బౌలర్లలో బుమ్రా(879 పాయింట్ల) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ 12వ స్థానంలో ఉన్నాడు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు వరుసగా 14,15వ స్థానాల్లో ఉన్నారు. బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ , శుభ్మన్ గిల్ వరుసగా 8వ, 9వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ జో రూట్ 880 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో హ్యారీ బ్రూక్ రెండవ స్థానంలో ఉండగా, అతని తర్వాత వరుసగా ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఉన్నారు .
ఈ వార్తలు కూడా చదవండి
బోణీ కొట్టిన సింధు, శ్రీకాంత్, లక్ష్య