ఆ ఓవర్లే మా కొంప ముంచాయి: సీఎస్కే కెప్టెన్ రుతురాజ్
ABN , Publish Date - Apr 19 , 2026 | 10:10 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(శనివారం) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో ఓడింది. ఛేదనలో సగం మ్యాచ్ వరకు పట్టు నిలుపుకున్న సీఎస్కే, ఆతర్వాత అనూహ్యంగా ఒత్తిడికి చిత్తై లక్ష్యానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad) స్పందించాడు. తమ ఇన్నింగ్స్లో మూడు ఓవర్ల మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయని తెలిపాడు.
రుతురాజ్ గైక్వాడ్ మీడియాతో మాట్లాడుతూ..' ఇలాంటి పిచ్పై 195 పరుగుల టార్గెట్ చేధించడం ఈజీనే. ఎస్ఆర్హెచ్ దూకుడు చూసి.. తొలుత 220–230 స్కోరు వచ్చేలా అనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతంగా కమ్బ్యాక్ ఇచ్చి 30 నుంచి 40 పరుగులు నిరోధించారు. ఇక మా ఇన్నింగ్స్ లో 10 ఓవర్ల తర్వాత 80 పరుగులు మాత్రమే అవసరం. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. కానీ 10వ ఓవర్ తర్వాతి 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే రావడం మ్యాచ్ స్వరూపాన్ని మర్చేసింది. డెత్ ఓవర్లలో 12 నుంచి13 పరుగులు ఛేజ్ చేయడం కష్టంగా మారింది' అని అన్నాడు.
'మా బౌలింగ్ విభాగాన్ని ప్రశంసించాలి. వరుసగా మూడు మ్యాచ్ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ప్లేలో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, ఆతర్వాత జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్.. అందరూ బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అన్షుల్ డెత్ ఓవర్లలో సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇందుకోసం అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఓటమి కారణాలను విశ్లేషించుకుని.. తదుపరి మ్యాచ్ కు సిద్ధం అవుతాము' అని రుతురాజ్ తెలిపాడు. మొత్తంగా సీఎస్కే నిన్నటి ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
సొంత రికార్డును బద్దలుగొట్టిన అభిషేక్ శర్మ.. చెన్నైపై అద్భుత ఇన్నింగ్స్..