Cricket: రాజ్కోట్ వన్డేలో భారత్పై న్యూజిలాండ్ అలవోక విజయం
ABN , Publish Date - Jan 14 , 2026 | 09:30 PM
భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్లో భాగంగా ఇవాళ రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు అలవోకగా విజయం సాధించింది. భారత్ ఇచ్చిన 284 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
ఆంధ్రజ్యోతి, జనవరి 14: రాజ్కోట్లో భారత్ vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ జరిగిన 2వ వన్డేలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు అలవోకగా చేధించారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ జట్టు 286 పరుగులు సాధించి.. మూడు మ్యాచ్ల వన్డే సీరిస్ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్లో మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సీరిస్ వశం కానుంది. ఆదివారం (జనవరి 18న) మూడో వన్డే ఇరు జట్ల మధ్య ఇండోర్ స్టేడియంలో జరుగనుంది.
285 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట్లో కష్టాలు ఎదుర్కొంది. కేవలం 22 పరుగులకే తన మొదటి వికెట్ కోల్పోయింది. స్కోరు 46 పరుగుల వద్ద రెండో వికెట్ చేజార్చుకుంది. తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్(131), విల్ యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
భారత ఇన్నింగ్స్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 284/7 స్కోరు సాధించింది. ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ స్టార్టర్లు విఫలమైనా, కెఎల్ రాహుల్ (112* నాటౌట్, 92 బంతుల్లో) అద్భుత సెంచరీతో జట్టును బాగా ఆదుకున్నాడు. ఇది అతని ODIల్లో 8వ సెంచరీ. శుభ్మన్ గిల్ అర్థసెంచరీ (56) స్కోరు చేశాడు. మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ బౌలర్లు భారత్ను కట్టడి చేశారు కానీ రాహుల్ ఫినిషింగ్తో స్కోరు 284 కి చేరింది.
కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 92 బంతుల్లో 112 నాటౌట్గా నిలిచాడు (11 ఫోర్లు, 1 సిక్స్). రాహుల్ 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాదు, ఒక అరుదైన రికార్డుకూడా నెలకొల్పాడు. నంబర్ 5 ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చి, వికెట్కీపర్గా న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
ఇక, శుభ్మన్ గిల్ (కెప్టెన్) ఓపెనర్గా వచ్చి 56 పరుగులు (53 బంతులు) చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ టాప్ స్కోరర్లలో రెండో స్థానంలో నిలిచాడు. అయితే, భారత టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్ లో విఫలమైంది. రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. పవర్ప్లేలో 57/0 అయినా, మిడిల్ ఓవర్లలో రన్ రేట్ పడిపోయింది. రవీంద్ర జడేజా 27, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా చిన్న కాన్ట్రిబ్యూషన్లు ఇచ్చారు. మొహమ్మద్ సిరాజ్ 2 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇన్నింగ్స్ ముగించాడు.

ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..