వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ABN , Publish Date - Jul 06 , 2026 | 06:29 PM
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంలో జాప్యంపై బీసీసీఐ స్పందించింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్లో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది. బీహార్కు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. దీంతో అతి పిన్న వయసులోనే భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కావాలనే వైభవ్ ఎంట్రీని ఆలస్యం చేస్తున్నారంటూ వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైభవ్ విషయంలో ఇంతటి పక్షపాతం ఎందుకంటూ ప్రశ్నించారు. తాజాగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంలో జాప్యంపై బీసీసీఐ స్పందించింది. అలానే గంభీర్, అయ్యర్లపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వైభవ్కు అభినందనలు తెలుపుతూ విమర్శలకు చెక్ పెట్టారు. 'బీసీసీఐ ఎప్పుడూ ప్రతిభకే ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరికీ అన్యాయం చేయదు. వైభవ్కు సరైన సమయంలోనే అవకాశం దక్కింది. జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమైనది. భవిష్యత్తులో అతను మరింత రాణించి జట్టులో స్థిరపడతాడనే నమ్మకం నాకుంది' అని శుక్లా పేర్కొన్నారు.
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
మరోవైపు కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వైభవ్.. టెస్ట్ హోదా కలిగిన దేశాల్లోనే అత్యంత పిన్న వయసులో టీ20 అరంగేట్రం చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును వైభవ్ అధిగమించాడు. తన తొలి మ్యాచ్లోనే ధైర్యంగా ఆడిన ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, 10 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్బాల్ సంఘం తీవ్ర విమర్శలు
యువ భారత్ను ఆదుకున్న 'జూనియర్ వాల్'.. అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీ!