ఆసియా క్రీడలు.. పురుషుల క్రికెట్ నాకౌట్ మ్యాచ్ల వేళల్లో కీలక మార్పులు!
ABN , Publish Date - Sep 12 , 2026 | 09:41 PM
జపాన్లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో భారత క్రికెట్ జట్లు పతకాల కోసం బరిలో దిగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ క్రీడల్లో క్రికెట్ను నిర్వహించడం ఇది నాలుగోసారి.
స్పోర్ట్స్ డెస్క్: జపాన్లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో భారత క్రికెట్ జట్లు పతకాల కోసం బరిలో దిగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ క్రీడల్లో క్రికెట్ను నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన 2023 ఆసియా క్రీడల్లో భారత్ పురుష, మహిళా జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించాయి. మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17న ప్రారంభం కానుండగా, పురుషుల పోటీలు సెప్టెంబర్ 24 నుంచి మొదలుకానున్నాయి.
మరోవైపు, పురుషుల క్రికెట్కు సంబంధించి కొన్ని నాకౌట్ మ్యాచ్ల ప్రారంభ వేళ్లలో మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు) ప్రారంభం కావాల్సిన మ్యాచ్లు, ఇకపై 30 నిమిషాలు ముందుగా 1:30 గంటలకు (భారత కాలమానం ఉదయం 10:00 గంటలకు) ఆరంభమవుతాయని ఓ స్పోర్ట్స్ మీడియా నివేదించింది. ఉదయం పూట జరిగే మ్యాచ్లు మాత్రం యథావిధిగా స్థానిక కాలమానం ఉదయం 9 గంటలకు (భారత కాలమానం ఉదయం 5:30 గంటలకు) ప్రారంభమవుతాయి.
ఈ మార్పు ప్రభావం సెప్టెంబర్ 28న జరిగే భారత్ క్వార్టర్ ఫైనల్, అక్టోబర్ 1న జరిగే రెండో సెమీఫైనల్, అలాగే అక్టోబర్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్లపై పడనుంది. అగ్రశ్రేణి జట్లుగా ఉన్న భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. గ్రూప్ దశల నుంచి వచ్చే ఇతర జట్లతో ఈ జట్లు తలపడతాయి. టోర్నీలో అత్యంత ఆసక్తికరంగా మారిన చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు కేవలం సెమీఫైనల్ లేదా ఫైనల్లో మాత్రమే జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్గా మహ్మద్ సిరాజ్..
ప్లేయర్లను మార్చినా.. పాకిస్థాన్కు తప్పని ఓటమి