T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్లు శ్రీలంకకు తరలింపు!
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:48 PM
2026 ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచ కప్లో బంగ్లా జట్టు.. భారత్లో ఆడాల్సిన మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి లేఖ రాయనుందని సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ధ్రువీకరించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్( India Bangladesh Tensions) మధ్య జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు టీ20 ప్రపంచకప్ 2026పై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగే ప్రపంచ కప్లో బంగ్లా జట్టు.. భారత్లో ఆడాల్సిన మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) లేఖ రాయనుందని సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ధ్రువీకరించారు. ఐసీసీకి అధికారికంగా తెలియజేయాలని, టోర్నమెంట్లో బంగ్లాదేశ్ మ్యాచ్లకు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ప్రతిపాదించాలని యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బీసీబీని ఆదేశించినట్లు నజ్రుల్(Asif Nazrul) తన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు.
‘క్రీడా మంత్రిత్వ శాఖకు ఇన్ఛార్జ్ సలహాదారుగా, ఈ మొత్తం విషయాన్ని లిఖితపూర్వకంగా ఐసీసీకి వివరించాలని క్రికెట్ కంట్రోల్ బోర్డుని ఆదేశించాను. ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ (ముస్తాఫిజుర్ రెహమన్)తో కాంట్రాక్ట్ పొందినప్పటికీ ఇండియాలో(ఐపీఎల్) ఆడే భద్రత లేకపోయింది. టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) ఆడటానికి మొత్తం బంగ్లాదేశ్ జట్టు ఇండియాకు పంపడం సురక్షితంగా ఉండదని బీసీబీ స్పష్టం చేయాలి. ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని అధికారికంగా అభ్యర్థించాలని ఆదేశించాను’ అని నజ్రుల్ తన పోస్ట్లో పేర్కొన్నారు. భారత్ లో బంగ్లాదేశ్ నాలుగు మ్యాచులు ఆడనుంది. మూడు కోల్కత్తా, ఒకటి ముంబై వేదికగా జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా
James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్