అలాంటి సమయాల్లో నటించలేం.. అర్ష్దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:54 PM
ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఓ ఆట కాదు.. ఓ ఎమోషన్. ఇప్పుడు ఇది కేవలం మైదానానికే పరిమితం కావడం లేదు. ఆట మధ్యలో కనిపించే చిన్న చిన్న క్షణాలు కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఓ ఆట కాదు.. ఓ ఎమోషన్. ఇప్పుడు ఇది కేవలం మైదానానికే పరిమితం కావడం లేదు. ఆట మధ్యలో కనిపించే చిన్న చిన్న క్షణాలు కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆటగాళ్లు తమ జీవితాన్ని మరింత దగ్గరగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదే సమయంలో అభిమానుల ఆలోచనా విధానం కూడా మారింది. మ్యాచ్ చూడటం మాత్రమే కాదు.. దాని తర్వాత జరిగే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలనే ఆసక్తి వారిలో పెరిగింది. ప్రత్యేకంగా జెన్జీ తరం ఈ మార్పునకు కారణమవుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ను అనుసరిస్తున్న వారిలో 85 శాతం మంది యువతే. వారికి కేవలం ఆట కాకుండా ఆటగాళ్ల వ్యక్తిత్వం, వారి నిజమైన జీవితాన్ని చూడాలనే ఆసక్తి ఎక్కువ అని పలు నివేదికలు పేర్కొన్నాయి.
తరానికి తగ్గట్టు క్రికెటర్లు కూడా మారుతున్నారు. కేవలం ఆటగాళ్లుగానే కాకుండా సాధారణ వ్యక్తులుగా కూడా అభిమానులతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్. మ్యాచ్ ముగిసిన తర్వాత సరదాగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు. అవి ఇట్టే వైరల్ అవుతుంటాయి. అర్ష్దీప్ సింగ్ వీడియోల గురించి ఎదురుచూసే అభిమానులు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆ విషయంపై అర్ష్దీప్ మాట్లాడాడు.
‘మైదానంలో నిజాయితీ చాలా ముఖ్యం. ఒత్తిడి సమయంలో ఇతరుల్లా నటించడం సాధ్యం కాదు. అదే విధంగా మైదానం బయట కూడా నేను నా లాగే ఉండాలని అనుకుంటాను. వికెట్ తీసుకున్నప్పుడు ఆనందం, కష్ట సమయంలో వచ్చే బాధ.. ఏదైనా నిజంగా పంచుకోవాలి అనిపిస్తుంది. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లు మనలో ఉన్న ఈ సహజత్వాన్ని చూపించడానికి సహాయపడుతున్నాయి. అభిమానులతో ఈ విధంగా దగ్గరగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే మ్యాచ్ విన్ ప్రతిసారీ వీడియో తీసి అప్లోడ్ చేయాలనిపిస్తుంది’ అని అర్ష్దీప్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
కెప్టెన్సీ విషయంలో ఎంఐ మరోసారి తప్పు చేయదనుకుంటున్నా: మహ్మద్ కైఫ్
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న వెస్టిండీస్ స్టార్ ప్లేయర్