Share News

ఫీల్డింగ్‌పై ఆందోళన లేదు.. మెరుగుపడేందుకు శ్రమిస్తున్నాం: అమోల్ మజుందార్

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:44 PM

జట్టులో ఫీల్డింగ్ లోపాలపై తాజాగా భారత మహిళల హెడ్ కోచ్ అమోల్ మజుందార్ స్పందించాడు. ఫీల్డింగ్‌లో మెరుగుపడేందుకు జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపాడు.

ఫీల్డింగ్‌పై ఆందోళన లేదు.. మెరుగుపడేందుకు శ్రమిస్తున్నాం: అమోల్ మజుందార్
Amol Muzumdar

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఎనిమిదో సారి కప్పు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా 13 క్యాచ్‌లు జారవిడవడం జట్టు ఫీల్డింగ్‌ లోపాలను ఎత్తిచూపింది. ఫైనల్లోనూ భారత ప్లేయర్లు మూడు క్యాచ్‌లను వదిలేశారు. ఈ క్రమంలో జట్టులో ఫీల్డింగ్ లోపాలపై తాజాగా హెడ్ కోచ్ అమోల్ మజుందార్ స్పందించాడు. ఫీల్డింగ్‌లో మెరుగుపడేందుకు జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపాడు. కొన్ని క్యాచ్‌లు జారవిడిచినంత మాత్రాన ఆ అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించాడు.


‘అవును.. ఫీల్డింగ్‌లో మేము ఇంకా మెరుగుపడాలి. కొన్ని క్యాచ్‌లు వదిలేసినా.. ఫీల్డింగ్ బాగానే చేశాం. ఈ అంశంపై ఎంతో కష్టపడుతున్నాం. శిక్షణలో చాలా సమయం కేటాయించాం. ఎంతో ప్రాక్టీస్‌ చేశాం. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుసు. అందుకోసం నిజాయితీగా కష్టపడతాం. ఇక్కడి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మేం మంచి స్కోర్లు సాధించాం. మిడిలార్డర్‌ విషయంలో మాకు ఎలాంటి ఆందోళన లేదు. షఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుతంగా ఆడుతున్నారు. టీ20 క్రికెట్‌లో అందరూ ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంది. దాని గురించి మాకు పూర్తి అవగాహన ఉంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ 150 సగటున పరుగులు చేశాం. మా క్యాంపుల్లోనూ సింగిల్స్, డబుల్స్ విషయంలో కసరత్తు చేస్తాం. దుబాయ్ వేడికి శరీరం త్వరగా అలసిపోతుంది. ఇలాంటి కష్టాలన్నీ దాటి విజేతగా నిలిచాం. అయితే ఈ టోర్నీతో సంతృప్తి చెందబోం. రానున్న టోర్నీ కోసం సిద్ధమవుతాం’ అని మజుందార్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

అభి‘షేక్‌’ చేశాడు!

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని ముందే చెప్పాం: బీసీసీఐ సెక్రటరీ

Updated Date - Sep 14 , 2026 | 03:44 PM