Share News

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 10:42 AM

హెచ్‌సీఏలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ వేటు వేశారు. ఆయన స్థానంలో అమర్‌నాథ్‌ను కొత్త ప్రెసిడెంట్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హెచ్‌సీఏలో కీలక పరిణామం..  నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌
Hyderabad Cricket Association

స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (Hyderabad Cricket Association)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ వేటు వేశారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను కొత్త ప్రెసిడెంట్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)ను బ్లాక్‌మెయిల్‌ చేశాడన్న ఆరోపణలు రావడం, అలానే సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావు(Jaganmohan Rao)ను ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేసింది. దీంతో ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్‌ హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంబుడ్స్‌మన్‌ తాజా తీర్పుతో అమర్‌నాథ్‌ పూర్తిస్థాయి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ బాధ్యతలు కూడా స్వీకరించారు.


అసలు సంగంతి ఇదే:

2023 అక్టోబరు 20న జరిగిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ) ఎన్నికల్లో 63 ఓట్లు సాధించిన జగన్మోహన్‌రావు అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఒక ఓటు తేడాతో అమర్‌నాథ్‌ రెండో స్థానంలో నిలిచారు. జగన్మోహన్‌రావు తప్పుడు పత్రాలు సమర్పించి అక్రమంగా పోటీ చేశారంటూ అంబుడ్స్‌మన్‌ను అమర్‌నాథ్‌ ఆశ్రయించారు. అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ కూడా అమర్‌నాథ్‌ వాదనలతో ఏకిభవించింది. మరోవైపు సన్‌రైజర్స్‌ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చేసింది. శ్రీచక్ర క్లబ్‌ కోశాధికారిగా జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేసినట్లు సీఐడీ నిర్ధరించింది. అధ్యక్షుడిగాఉన్న సమయంలో టెండర్లు లేకుండానే క్యాటరింగ్‌ కాంట్రాక్టులు కట్టబెట్టాడని, అలానే ప్లంబింగ్, ఏసీలు, దుస్తుల కొనుగోళ్లలో కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టించాడని ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే 2025 జులై 9న సీఐడీ అధికారులు అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


అంబుడ్స్‌మన్‌ కీలక వ్యాఖ్యలు:

అమర్‌నాథ్‌ పిటిషన్‌ను విచారించిన అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌.. జగన్మోహన్‌రావు ప్రవర్తన హెచ్‌సీఏ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడ్డారు. తప్పుడు పత్రాల ద్వారా పదవిని పొందడం వంటి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని అంబుడ్స్‌మన్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీఏ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచలేమని పేర్కొన్నారు. ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా(Amar Nath HCA President) ప్రకటిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. త్వరలో ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడి నియమాకం అనివార్యమైంది.


ఇవీ చదవండి:

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

Updated Date - Feb 03 , 2026 | 10:48 AM