సీఎం ఆదేశాలను.. ఆటో డ్రైవర్ ఎలా పాటిస్తున్నాడో చూస్తే..
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:27 AM
మహారాష్ట్రలోని ఆటో డ్రైవర్లకు కష్టమొచ్చింది. దానిని నుంచి బయటపడేందుకు ఆటో డ్రైవర్ చేసిన పనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆటో డ్రైవర్లంతా మరాఠీ భాష నేర్చుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 50 ఏళ్లు దాటిన ఆటో డ్రైవర్ పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ ఓ ఆటో డ్రైవర్ చేసిన చిన్న ప్రయత్నానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వయస్సు మళ్లిన డ్రైవర్.. ఆటోను నడుపుతున్నాడు. అతడి ముందున్న అద్దంపైన ఓ కాగితం వేలాడుతోంది. అందులో హిందీ, మరాఠీ భాషకు సంబంధించిన పదాలు ఉన్నాయి.
హిందీ పదాలు.. వాటి మరాఠీ అర్థాలతో ఓ జాబితాను తయారు చేసుకున్నాడు. ఆ పదాలను ఉపయోగించి.. అతడు కస్టమర్లతో మాట్లాడతాడని అర్థమవుతోంది. హిందీ వచ్చిన అతడు.. స్థానికులతో మాట్లాడడం కోసం ఈ విధంగా ఆ కాగితాన్ని పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. కేవలం భాష నేర్చుకోవడమే కాకుండా.. ప్రయాణికులతో మెరుగైన సంభాషించడం కోసం అతడు ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అతడు తన జీవనోపాధి కోసం సంపాదిస్తూ ఓ కొత్త భాషను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఒకరు తెలిపారు. ప్రజలను కలిపే అత్యంత ప్రభావవంతమైన సాధానం భాష. అతడు అందుకోసమే ప్రయత్నిస్తున్నాడని మరొకరు చెప్పారు. భాషలకు సరిహద్దులు లేవని ఇంకోకరు పేర్కొన్నారు.
మరాఠీ కంపల్సరీ..
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లంతా కచ్చితంగా మరాఠీ నేర్చుకోవాలంటూ దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మరాఠీ నేర్చుకోవడానికి విధించిన గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ఆటో యూనియన్ నేతలు సమావేశమై.. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక మరాఠీ భాష నేర్చుకోవడానికి మరో ఏడాది గడువు పెంచుతున్నట్లు ఆగస్టు 15వ తేదీన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. 50 ఏళ్ల దాటిన ఆటో డ్రైవర్లు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాటిని సీఎం దృష్టికి వారు తీసుకెళ్లారు.