నెట్వర్క్ సమస్య.. టెక్నీషియన్ను టవర్కు కట్టేసిన గ్రామస్థులు
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:00 PM
మొబైల్ నెట్వర్క్ సరిగా రావడం లేదని ఆగ్రహించిన గ్రామస్థులు ఓ టెలికాం టెక్నీషియన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అతడిని టవర్కు కట్టేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో మొబైల్ నెట్వర్క్ సమస్యపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో మొబైల్ టవర్ ఉన్నప్పటికీ నెట్వర్క్ సరిగా పనిచేయడం లేదని ఆగ్రహించిన వారు.. అక్కడికి వచ్చిన ఓ టెక్నీషియన్ను ఏకంగా టవర్కు కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫతేపూర్ జిల్లా హర్దౌలి గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా గ్రామంలో నెట్వర్క్ సమస్య ఉందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఈ క్రమంలో టవర్కు సంబంధించిన పనుల కోసం టెక్నీషియన్ గ్రామానికి రావడంతో అతడిని గ్రామస్థులు చుట్టుముట్టారు. నెట్వర్క్ సమస్యను పరిష్కరించేందుకు టెలికాం కంపెనీ అధికారులు గ్రామానికి వచ్చేవరకు టెక్నీషియన్ను విడిచిపెట్టబోమని గ్రామస్థులు చెప్పినట్లు సమాచారం. 5G సేవల కోసం రీఛార్జ్లు చేసుకుంటున్నప్పటికీ.. నెట్వర్క్ సరిగా లేకపోవడంతో ఫోన్ కాల్స్ చేయడం, ఇంటర్నెట్ ఉపయోగించడం కూడా కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల రంగప్రవేశం
ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. టెక్నీషియన్ను టవర్ నుంచి విడిపించారు. నెట్వర్క్ సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు బింద్కి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శైలేష్ సింగ్ తెలిపారు. టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:
పంజాబ్లో దారుణం.. వీల్చైర్లో ఉన్న వ్యక్తి నగదు దోపిడి.. వీడియో వైరల్
హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!