ఖరీదైన పెళ్లిపత్రిక..
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:16 PM
జైపుర్కు చెందిన శివ్ జోహ్రీ.. తన కూతురు పెళ్లి గుర్తుండిపోయేలా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏకంగా మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో ప్రత్యేక ఆహ్వాన పత్రికను తయారుచేసి వార్తల్లోకి ఎక్కాడు. వివరాలిలా ఉన్నాయి.
వెండి ధర రోజురోజుకూ కొండెక్కుతున్న తరుణంలో జైపుర్కు చెందిన శివ్ జోహ్రీ... తన కుమార్తె వివాహం కోసం ఏకంగా మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో ప్రత్యేక ఆహ్వాన పత్రికను తయారుచేసి వార్తల్లోకి ఎక్కాడు. మొత్తం 128 విడి భాగాలతో పెట్టెలాగా ఉన్న పత్రికలో ఒక్క మేకు లేదా స్ర్కూ వాడకపోవడం విశేషం.
ఈ ఆహ్వాన పత్రికలో 65 దేవతా విగ్రహాలను సూక్ష్మంగా పొందుపరిచాడు. పై భాగంలో గణేశుడు, ఇరుపక్కల శివ పార్వతులు, కింద లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల చిత్రాలను ఉంచాడు. కలియుగ దైవం తిరుపతి బాలాజీ రెండు రూపాలు, విష్ణుమూర్తి దశావతారాలు, పత్రిక బయటవైపు (అంచుల వెంబడి) అష్టలక్ష్ములు.... ఇలా సకల దేవతలను ఒకే పత్రికపైకి తీసుకొచ్చాడు. అలాగే శ్రీకృష్ణుని బాల్య లీలలు, దేవుడి ద్వార పాలకులనూ పొందుపరిచాడు.
కార్డు మధ్యలో వధూవరుల పేర్లు.. దాని చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్టుగా చెక్కిన దృశ్యం అదరహో అనిపిస్తుంది. సాంప్రదాయ పత్రికల మాదిరిగానే ఇరు కుటుంబసభ్యుల పేర్లనూ చక్కగా ముద్రించి తన కాబోయే వియ్యంకుడికి అందజేశాడు. దీని తయారీకి సుమారు రూ.25 లక్షలు ఖర్చు అయినట్లు అంచనా. ‘నా గారాలపట్టీ పెళ్లికి బంధువులనే కాదు... దేవతలనీ ఆహ్వానించాలనుకున్నా. అందుకే ఏడాదిపాటు కష్టపడి స్వయంగా తయారుచేశా’ అంటున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి.
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News