అత్త కోరిక నెరవేర్చాలని.. తలపై మోస్తూ 260 కి.మీ.ల పాదయాత్ర
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:45 PM
అత్తాకోడళ్ల బంధానికి సరికొత్త అర్థం చెబుతూ, నడవలేని స్థితిలో ఉన్న తన 90 ఏళ్ల అత్తగారి చిరకాల కోరికను తీర్చడం కోసం.. ఆమెను తలపై మోస్తూ 260 కిలోమీటర్ల క్లిష్టమైన యాత్రకు పూనుకుందో కోడలు. వివరాల్లోకి వెళ్తే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత సమాజంలో అత్తాకోడళ్లు అనగానే మనస్పర్థలే గుర్తొస్తాయి. అలాంటిది ఓ కోడలు తన 90 ఏళ్ల అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చడం కోసం చేసిన సాహసయాత్ర అందరి హృదయాలను గెలుచుకుంటోంది. హర్యానాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్ చౌదరీ.. నడవలేని స్థితిలో ఉన్న తన అత్తగారు చంద్రీదేవి (90) పవిత్రమైన బ్రిజ్ పరిక్రమ అని పిలువబడే యాత్ర చేయాలనే కోరికను తీర్చేందుకు నడుం బిగించింది. ఈ యాత్రలో భక్తులు.. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథుర, హరియాణాతో పాటూ రాజస్థాన్ సరిహద్దులో ఉన్న కృష్ణుడికి సంబంధించిన ప్రదేశాలను దర్శించుకుంటారు. ఇందుకోసం ఆ కోడలు.. ఒక ప్లాస్టిక్ టబ్బులో అత్తగారిని కూర్చోబెట్టుకుని, తలపై మోస్తూ సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర స్థలాల గుండా సాగే ఈ యాత్ర సుమారు 84 కోసులు, అంటే దాదాపు 260 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని మథుర, బృందావన్లతో పాటు హరియాణా, రాజస్థాన్లలోని పుణ్యక్షేత్రాలను సందర్శించే ఈ కఠినమైన యాత్ర పూర్తి కావడానికి దాదాపు 40 రోజుల సమయం పడుతుంది. అంతటి సుదీర్ఘ మార్గాన్ని కాజల్ అపారమైన భక్తిశ్రద్ధలతో అధిగమిస్తున్నారు. ఈ సందర్భంగా కాజల్ చౌదరీ మాట్లాడుతూ.. ‘మా అత్తయ్య నన్ను ఎప్పుడూ కోడలిలా చూడలేదు, సొంత బిడ్డలాగే ఆదరించారు. ఆమె రుణం తీర్చుకోవడం నా ధర్మం నేను చేస్తున్నా’ అని అన్నారు. అత్తగారిపై ఆమె చూపిస్తున్న ఈ అపూర్వమైన ప్రేమానురాగాలకు అంతా ఫిదా అవుతున్నారు. అత్తగారిని మోసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో యాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు ఆమెకు పూలమాలలు, హారతులతో స్వాగతం పలుకుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు
యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News