ఏసీ రిపేర్కు వచ్చి.. ఆర్టిస్ట్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ABN , Publish Date - May 28 , 2026 | 03:01 PM
ఢిల్లీకి చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మెహక్ విఠల్ ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీకి చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మెహక్ విఠల్ ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా ఎయిర్ కండిషనర్ రిపేర్ కోసం వచ్చే టెక్నీషియన్లు తమ పని పూర్తిచేసుకుని వెళ్లిపోతుంటారు. కానీ మెహక్ ఇంటికి వచ్చిన ఇద్దరు ఏసీ టెక్నీషియన్లు మాత్రం.. ఆమెకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె గదిలో అలంకరించిన పెయింటింగ్లు, చేత్తో చేసిన విభిన్న కళాకృతులను చూసివారు ఫిదా అయ్యారు. తాము వచ్చిన పనిని కాసేపు పక్కనపెట్టి, ఆ హస్తకళలను నిశ్శబ్దంగా, ఎంతో ఆరాధనగా చూస్తూ ఉండిపోయారు. ఓ సాధారణ సర్వీస్ అపాయింట్మెంట్ కాస్తా, అనుకోకుండా ఓ చిన్న ఆర్ట్ ఎగ్జిబిషన్లా మారిపోయింది. టెక్నీషియన్ల హృదయపూర్వకమైన ఈ స్పందనను మెహక్ తన మొబైల్లో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో అది కాస్తా నెటిజన్ల మనసులను గెలుచుకుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ టెక్నీషియన్ గదిలో ఏసీ పని చూసుకుంటూనే.. గోడలపై ఉన్న చిత్రాలను గమనించడం కనిపిస్తుంది. వాటిని కేవలం పైపైన చూసి వదిలేయకుండా, ప్రతి పెయింటింగ్ దగ్గరా ఆగి, ఎంతో జాగ్రత్తగా, ఆసక్తిగా పరిశీలించాడు. వారి ముఖాల్లోని ఆ నిశ్శబ్ద ఆరాధన.. కళపట్ల చూపిన గౌరవం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. నిజమైన కళను గుర్తించడానికి, ఆస్వాదించడానికి ఎలాంటి హద్దులు ఉండవని ఈ దృశ్యం నిరూపించింది. ఈ హృద్యమైన క్షణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ మెహక్ విఠల్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. 'వారు నా ఇంటి ఏసీని మాత్రమే బాగు చేయలేదు.. నా మనసు ఆనందంతో నింపేశారు. ఇంత నిజాయతీతో కూడిన స్పందనలు చూశాక నా హృదయం సంతోషంతో నిండిపోయింది' అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు టెక్నీషియన్ల ప్రవర్తనను, వారిలోని కళాభిమానాన్ని అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి
అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం