విజయ్కు గవర్నర్ అనుమతి.. ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - May 08 , 2026 | 07:43 PM
తమిళనాడులో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగగమైంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ శుక్రవారం సాయంత్రం అనుమతించారు.
చెన్నై: తమిళనాడులో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన విజయ్ సారథ్యంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగగమైంది. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలంతో గవర్నర్ ఆర్వీ అర్లేకర్ను విజయ్ రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. దీంతో సంతృప్తి చెందిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించారు. మరోవైపు కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మే 4న ఫలితాలు వెలువడిన అనంతరం గవర్నర్ను విజయ్ కలవడం ఇది మూడోసారి. విజయ్ రెండు చోట్ల గెలవడంతో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరమైంది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ఆ బలం 112కు చేరింది. ఈ క్రమంలో ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ, సీపీఎం సైతం బేషరుతుగా టీవీకేకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మెజారిటీ అవసరమైన 118 మంది సభ్యుల బలం టీవీకే సంపాదించగలిగింది. దీనికితోడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఐయూఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకేకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల బలం 120కి చేరుకుంది.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో విజయ్కు లైన్ క్లియర్.. సంఖ్యా బలం రెడీ..
సోనార్ బంగ్లా కలల సాకారం.. సువేందును శాసనసభాపక్ష నేతగా ప్రకటించిన అమిత్షా